ఏపీలో మద్యం వరద : విశాఖ టాప్.. ఖజానాకు పోటెత్తుతున్న ఆదాయం
విజయవాడ : ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. మందుబాబుల నిషా ప్రభుత్వ గల్లా పెట్టెను నింపేస్తోంది. దీంతో బెల్టు షాపుల వ్యవహారాన్ని కూడా ప్రభుత్వం అంత సీరియస్ గా పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతీ ఏటా తన పరిధిని విస్తరించుకుంటూ పోతున్న మద్యం రంగాన్ని వీలైనంత మేర క్యాష్ చేసుకోవాలనే యోచనలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. మద్యంపై ఖజానాకు ఆదాయం పోటెత్తుతుండడంతో.. రానున్న రోజుల్లో మద్యం అమ్మకాలపై పన్ను రేటును పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇప్పటికే సంకేతాలు అందినట్లుగా సమాచారం.
ఇకపోతే.. ఏపీలో మద్యం విక్రయాల పరంగా విశాఖ టాప్ లో కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికంగా 876 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు విశాఖలో జరిగాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు మరింతగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2014లో 11,569 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగ్గా.. 2015లో 12,596 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి.
ఇక గతేడాది అక్టోర్ నాటికి మద్యం అమ్మకాలు రూ. 6,665 మద్యం విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దాదాపు రూ.7,914 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. మద్యం ఆదాయాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోన్న ప్రభుత్వం.. ఇందుకోసం అధికారులపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మద్యం లైసెన్స్ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. బెల్టు షాపులపై చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖ తర్వాత.. తూర్పు గోదావరి-836 కోట్లు, కృష్ణా జిల్లా-814 కోట్లు, గుంటూరు-792 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అతి తక్కువగా కడపలో కేవలం 388 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు మాత్రమే జరగడం గమనార్హం. మద్యం విక్రయాల్లో ఇదే జోరు కొనసాగితే.. వచ్చచే మార్చి నెలాఖరుకు దాదాపు 14వేల ఆదాయం ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా చేకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.