ఏపీలో మద్యం షాపులు ఇక రాత్రి 9 గంటల వరకు: చివరి గంట దేనికోసమంటే? మందుబాబులకు నో ఛాన్స్
అమరావతి: రాష్ట్రంలో మద్యం దుకాణాల సమయాన్ని సవరించింది ప్రభుత్వం. మద్యం దుకాణాలు తెరచి ఉంచే సమయాన్ని పొడిగించింది. ఇప్పటిదాకా రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలు రాత్రి 8 గంటల వరకే మూత పడాల్సి ఉండగా.. మరో గంట సమయాన్ని పెంచింది. రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రాబోతున్నాయి.
రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజ్ఙప్తి మేరకు మద్యం దుకాణాలను ఒక గంట పాటు అదనంగా తెరచి ఉంచడానికి అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించడం, అకౌంట్లను సరి చేయడం, ఆ మొత్తాన్ని కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్ఎంఎస్) ద్వారా రాష్ట్ర ఖజానాకు జమ చేయడానికి అవసరమైన బిల్లులను రూపొందించుకోవడం కోసమే అదనంగా గంట సమయాన్ని పొడిగించినట్లు తెలిపారు.
చివరి గంటలో మద్యం అమ్మకాలు ఉండబోవని స్పష్టం చేశారు. ఇదివరకట్లా మద్యం అమ్మకాలను రాత్రి 8 గంటల వరకే నిలిపివేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు వచ్చిన ఆదాయాన్ని ఏరోజుకారోజు పర్యవేక్షించాల్సి రావడంలో తలెత్తుతున్న ఇబ్బందులను నివారించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు రజత్ భార్గవ తెలిపారు. మద్యం అమ్మకాలను చేపట్టినట్లు సమాచారం అందితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం అమ్మకాల దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లినందున నిర్దేశిత సమయానికి అనుగుణంగా అమ్మకాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇంతకుముందులా అర్ధరాత్రి వరకూ మద్యం దుకాణాలను తెరచి ఉంచే విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. వచ్చిన ప్రతి రూపాయినీ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు చూపాల్సి ఉంటుంది.
Recommended Video
రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసివేయడం వల్ల ఏరోజుకారోజు వచ్చిన ఆదాయాన్ని ఏపీబీసీఎల్కు జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తించారు. కొన్ని షాపుల నుంచి వారం రోజుల వరకూ ఆదాయ వివరాలు తమకు అందట్లేదనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ పరిష్కరించడానికి రోజువారీ ఆదాయాన్ని గుర్తించడానికీ.. చివరి గంట గడువును అదనంగా పొడిగించినట్లు రజత్ భార్గవ తెలిపారు.