మందుబాబులకు బ్యాడ్ న్యూస్...మరో 48 గంటల్లో మద్యం బంద్
ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన ప్రియులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే!...రోజూ క్రమం తప్పకుండా మద్య తాగేవారైనా...అప్పుడప్పుడు సేవించే వారైనా...మగైనా...ఆడైనా...కొన్నాళ్లపాటు ఆల్కహాల్ కు దూరంగా ఉండాల్సిందే...ఆరోగ్యం కోసం కాదండీ...అనివార్యం...అదేంటంటారా?
ఎందుకంటే...ఎపిలోని మద్యం విక్రేతలు రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అదికూడా మరో 48 గంటల్లోనే అంటే ఏప్రిల్ 25 నుంచి ఈ బంద్ ప్రారంభం కానుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు బంద్ చేయడం ఏపి చరిత్రలోనే ఇదే మొదటిసారని తెలుస్తోంది. ఇంతకీ ఈ బంద్ కు కారణమేంటంటారా?...మద్యం అమ్మకాల్లో తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను పుంచాలని డిమాండ్ చేస్తూ వైన్ డీలర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను 10 నుంచి 16 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ రాష్ట్ర వైన్ డీలర్స్ అసోసియేషన్ ఈ నెల 25 నుంచి మద్యం విక్రయాలు నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మద్యం షాపుల్లో...బార్లలో ఉన్న సరుకు అయిపోయిన వెంటనే అమ్మకాలు నిలిచిపోనున్నట్లు తెలుస్తోంది. శనివారం విజయవాడలో జరిగిన ఏపీ రాష్ట్ర వైన్ డీలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆ మేరకు తీర్మానం జరిగిన సంగతి తెలిసిందే. సంఘం అధ్యక్షుడు రాయల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మద్యం వ్యాపారులు పాల్గొని అసోసియేషన్ నిర్ణయానికి సంఘీభావం తెలిపారు.
అయితే అమ్మకాలు జరపకపోయినా షాపులు, బార్లు తెరిచే ఉంచుతామని ఈ సందర్భంగా వ్యాపారులు చెప్పడం గమనార్హం. మద్యం వ్యాపారం వల్ల తమకు నష్టం వాటిల్లుతున్న విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అయినా ప్రయోజనం లేకపోవడంతోనే బంద్ చేపట్టాలని నిర్ణయించినట్లు వైన్ డీలర్స్ చెబుతున్నారు. విడివిడిగా కాకుండా ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేయడం వల్లే ప్రభుత్వంపై ప్రభావం చూపగలమనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు.
2017 జూన్ వరకు మద్యం అమ్మకాల్లో మార్జిన్ 21 శాతం ఉండేదని, ఆ తరువాత దానిని 10 శాతానికి తగ్గించారని వైన్ డీలర్స్ చెబుతున్నారు. అదేమంటే ప్రభుత్వం లైసెన్సు ఫీజులు తగ్గించిందని, అందువల్లే మార్జిన్ను తగ్గించినట్లు అధికారులు చెబుతున్నారని, కానీ దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు వైన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఒకసారి ఒప్పందం అమల్లోకి వచ్చాక నిబంధనలను మార్చడం కుదరదని, అయినా ప్రభుత్వం అందుకు విరుద్దంగా నిబంధనలు మార్చిందని ఆరోపించారు. నష్టాలు వస్తున్నందున మార్జిన్ను పెంచాలన్నతమ డిమాండ్ను అధికారులు పట్టించుకోకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత్యంతరం లేక బంద్ ప్రకటించామే తప్ప ప్రభుత్వాన్ని బెదిరించే ఉద్దేశ్యం తమకు లేదంటున్నారు మద్యం విక్రేతలు.