11 నుండి 8 వరకే మద్యం అమ్మకాలు ...
సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా నూతన మద్యం పాలసీని తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.. ముఖ్యంగా మద్య నిషేధాన్ని దశలవారిగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసిన విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే మద్యం అమ్మకాలను ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకుంది. దీంతో ప్రైవేట్ వైన్ షాపులను రద్దు చేసి ప్రభుత్వమే వాటిని నడిపేందుకు సిద్దమైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులను కూడ 20 శాతం మేర తగ్గించింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ మద్యం అమ్మకాలపై సమయాన్ని నిర్ధేశించింది. ప్రైవేట్ వ్యాపారుల వలే కాకుండా మద్యం అమ్మకాన్ని కొద్ది గంటలే నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లొ ఉదయం 11 గంటల నుండి రాత్రీ ఎనమిది గంటల వరకే మద్యం అమ్మకాలను కొనసాగించనుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మూడువేల షాపులను నిర్వహించనున్న ప్రభుత్వం పట్టణాల్లోని ప్రతి దుకాణంలో ఒక సూపర్వైజర్తో పాటు ముగ్గురు సేల్స్మెన్లను నియమించింది. గ్రామాల్లో మాత్రం ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు సేల్స్మెన్స్ కొనసాగనున్నారు.
మరోవైపు వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూమ్స్, లూజ్ సేల్స్పై కూడా నిషేధం విధించింది. ఒకవేళ వైన్ షాపు సిబ్బంది ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మద్యం దుకాణాలపై అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం అందుకు కావాల్సిన సరంజామాను పలు షాపుల్లోకి సైతం ఇప్పటికే చేర్చారు. మద్యం షాపుల్లో కొరత రాకుండా ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేశారు.