3,207 లీటర్ల మద్యం, రూ.72 లక్షలు: 14 వేల బాటిళ్లను రోడ్ రోలర్తో తొక్కించేశారు, ఏపీలోనే..(వీడియో)
అప్పట్లో ఒక వీడియో వైరలైంది. మందు బాటిళ్లను వరుసగా పెట్టి రోడ్డు రోలర్తో తొక్కిస్తారు. ఆ వీడియో చూసిన మందుబాబుల గుండె తరుక్కుపోయింది. అయితే చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి బయటకొచ్చింది. అయితే అది మరెక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్లో జరగడం విశేషం. మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో వరసగా లిక్కర్ బాటిల్స్ పెట్టి.. రోడ్ రోలర్తో తొక్కించారు. అలా ఒక్కో బాటిల్పై నుంచి రోడ్డు రోలర్ వెళ్లిపోయింది.
43 వేల బెల్ట్ షాపుల క్లోజ్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్పై కఠిన చర్యలు తీసుకుంది. బెల్ట్ షాపులను మూసివేయించింది. దాదాపు 43 వేల బెల్ట్ షాపులు క్లోజ్ చేశారు. 20 శాతం వైన్ షాపులను తగ్గించగా.. 4500 పర్మిట్ రూమ్లను కూడా క్లోజ్ చేయించారు. లాక్ డౌన్ తర్వాత కూడా 13 శాతం మద్యం షాపులను తగ్గించేశారు. మద్యం ధరలను మాత్రం 75 శాతం పెంచారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
10 పీఎస్..
మరీ ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఏపీకి దొడ్డిదారిన మద్యం తరలిస్తున్నారు. వివిధ మార్గాల్లో తరలించే మద్యాన్ని పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. అయితే ఇటీవల 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా మద్యం పట్టుకున్నారు. ఇదంతా పొరుగున గల తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. మద్యం తరలించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.
రూ.72 లక్షల విలువజేసే మందు
ఈ మందును ధ్వంసం చేయాలని అధికారులు భావించారు. అందుకు న్యాయ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. 3 వేల 207 లీటర్ల మందు, 14 వేల బాటిళ్లను పట్టుకున్నారు. దీని విలువ రూ.72 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ మందును మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో వరసగా పెట్టారు. రోడ్ రోలర్తో తొక్కించారు. దీనిని వీడియో తీయగా... ఎఎన్ఐ వార్తా సంస్థ వీడియోను పోస్ట్ చేసింది.
తెలంగాణ నుంచి తరలింపు
తెలంగాణతో సరిహద్దు గల కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా మద్యం తరలించారని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. చెక్ పోస్టుల వద్ద మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అక్రమంగా మద్యం తరలించిన 312 మందిపై కేసు నమోదు చేశారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాపై పర్యవేక్షణ కోసం ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. మద్యం, ఇసుక తరలింపునకు సంబంధించి 400 శాతం కేసులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.