కాస్త బెరుకు.. మరి కాస్త తొందరపాటు..! జగన్ పాలనలో పదనిసలు..!!
రెండువేల తొమ్మిది నాటి కల రెండువేల పందొమ్మిదిలో నెరవేరింది. పదేళ్ల ప్రస్తానంలో పదహారు నెలలు జైలు జీవితం.. లక్షకోట్లరూపాయల అవినీతి అపవాదు. ఐదు పార్టీలు ఏకమై అభిమన్యుడుగా మార్చిన రాజకీయం. ఇదంతా జగన్ మోహన్రెడ్డి పదేళ్ల పార్టీ ప్రస్థానం. అన్నీ తట్టుకున్నాడు. భరించాడు. సీఎం సీటు సంపాదించాడు. అంతవరకూ బాగానే ఉంది. పాలనకు అనుభవం కంటే.. మానవత్వంతో స్పందించే మనసుంటే చాలు అనే దాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నాడు. ప్రమాణస్వీకారం చేసిన మూడ్రోజులకే తన మార్కు చూపే ప్రయత్నం చేశాడు. అయితే ఏదో మూలన కాస్త ఎమోషన్.. మరికొంత కన్ఫ్యూజన్ వెరసి.. జగన్ లో కాస్త బెరుకు తనం కనిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
వయసు చిన్నది.. బాద్యత పెద్దది..! సుపరి పాలన దిశగా జగన్..!!
తెలంగాణ సీయం చంద్రశేఖర్ రావు అన్నట్టు జగన్ మోహన్ రెడ్డి వయసు చిన్నది, బాద్యత పెద్దది. దానికనుగణంగానే ఏపిలో జగన్ పాలన కొనసాగుతుందా అంటే అవునంటున్నాయి పార్టీ శ్రేణులు. పెళ్లయి అత్తవారింట అడుగుపెట్టిన కొత్త కోడలులో కనిపించే బెరుకు ఎంత దాచుకుందామన్నా దాగదు. ఇప్పుడు అదే జగన్లోనూ కనిపిస్తుంది. ఎంత గంబీరంగా ఉందామని భావించినా ఇట్టే బయటపడిపోతుంది. పైగా తనకు రాజకీయంగా సలహాలు. సూచనలు ఇచ్చేందుకు అధికారులు సాహసం చేయట్లేదు. మరోవైపు టీడీపీ, బీజేపీలు కాచుకు కూర్చున్నాయి. అవకాశం దొరికితే విమర్శలు కురిపించాలని భావిస్తున్నాయి.
సమీక్షల్లో మతలబులు..! సీఎం తొందరపాటు చర్యలంటున్న పార్టీ శ్రేణులు..!!
జగన్ పాలన పగ్గాలు చేపట్టగానే చేసిన సమీక్షలు టీడీపీను వేదిస్తున్నాయి. నీటిపారుదల, ఆరోగ్యం, విద్య, ఎక్సయిజ్ వంటి కీలకమైన అంశాలపై సమగ్ర నివేదిక కావాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిధులు లేకుండా ఏమీ చేయలేని సమయంలో జగన్ ఏమి చేస్తాడనేది కూడా అధికారుల్లో నెలకొన్న అనుమానం. మరోవైపు ఆధ్యాత్మిక గురువుతో రాజకీయ చర్చలు.. మంత్రిపదవులకు అర్హులు ఎవరనేదానిపై చర్చలు.. మరోవైపు కేసీఆర్ ద్వారా మంత్రి పదవి చేపట్టాలని చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, హైదరాబాద్లోని ఏపీ ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టడం వంటివి ఏపీ ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఎమోషనల్ టచ్ చేస్తున్న సీఎం..! అదే సమయంలో ప్రతిపక్షంలో గుబులు..!!
ఇప్పటి వరకూ ఏపీ సీఎంలు ఎవరూ.. రాజకీయాలను మతాలకు ముడిపెట్టలేదు. పైగా ఇలా స్వామీజీల చుట్టూ తిరిగిన చరిత్ర కూడా లేదు. జగన్ ప్రస్తుతం పరిస్థితులను అవగతం చేసుకునేందుకు సమయం తీసుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు సమర్ధించుకోవచ్చు. కానీ.. రాజకీయంగా ఇవన్నీ రేపటిరోజున ఏపీని చిక్కుల్లో పడేస్తాయనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇకపోతే.. వృద్ధుల పింఛన్, ఆశ వర్కర్ల వేతనం.. విశాఖలో కేన్సర్ బాధితురాలికి ఆర్ధికసాయం.. వెరసి.. ఎమోషన్గా జగన్ జనానికి బాగానే చేరువయ్యాడు. అదే సమయంలో సీబీఐకు ద్వారాలు తెరవటం ద్వారా తాను సాగించబోయే అశ్వమేధం ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు.
తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో..! ఎన్నో కష్టాలు అనుభవించిన నేతలు..!!
ఏమైనా.. జగన్ ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. వైఎస్ తనయుడిగా. ఉన్నత విద్యావంతుడిగా.. కొత్తగా రాష్ట్ర ప్రగతిని నడిపించాలని ఆశపడుతున్నాడు. ఈ క్రమంలో కాస్త భయం, సంశయం.. ఇవన్నీ సహజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏమైనా జగన్ మోహన్రెడ్డి కొత్త శకానికి తన పాలన ద్వారా నాందీ పలుకుతారనేది వైసీపీ ఆశ. అయితే.. అవినీతి విషయానికి వచ్చేసరికే.. కోట్లు కుమ్మరించి గెలిచిన ప్రజాప్రతినిధుల్లో ఏదో అనుమానం.. తాము కుమ్మరించిన కాసులకు మోక్షం ఎప్పుడనే ధర్మ సందేహం. వెరసి.. తమ నాయకుడి బావోద్వేగాలు. కన్ఫ్యూజన్ను ఎలా తీసుకోవాలనేది అర్ధం గాక జుట్టు పీక్కుంటున్నారట మిగిలిన నేతలు.