తెలంగాణ బంద్: సున్నం రాజయ్య ఆమరణ దీక్ష
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్)లో కలుపుతూ రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ను నిరసిస్తూ తెలంగాణలో గురువారం ఉదయమే బంద్ ప్రారంభమైంది. ఆర్డినెన్స్కు నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమతి (తెరాస) బంద్కు పిలుపునిచ్చింది. బంద్ను విజయవంతం చేయడానికి తెరాస నాయకులు, కార్యకర్తలు గురువారం తెల్లవారు జామునే బస్సు డిపోల ముందు ధర్నాలకు, ప్రదర్శనలకు దిగారు.
పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడంపై స్థానిక శాసనసభ్యుడు సున్నం రాజయ్య గురువారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రేపటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.
తెరాస బంద్తో తెలంగాణ జనజీవనం స్తంభించింది. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా బంద్ ప్రభావం కనిపించింది. ఆర్టీసి బస్సులు నడవలేదు. వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.
తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరుగుతోందని డిజిపి ప్రసాద రావు చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా గురువారంనాడు సమ్మె జరుగుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడాలంటే సమయం పడుతుంది కాబట్టి పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసినట్లు తెలుగదుేశం పార్టీకి చెందిన కెంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. ఆయన పౌరవిమాన యానశాఖ మంత్రిగా గురువారం పదవీబాధ్యతలు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు ఇక ఏ విధమైన అడ్డంకులు ఉండవని, సమన్యాయం జరిగినట్లేనని ఆయన అన్నారు.
తెలంగాణ అంతటా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాము పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, దాని డిజైన్ మార్చాలని తెరాస శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.
తెరాస శాసనసభ్యుడు ఈటెల రాజేందర్, తదితరులు సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. నిజామాబాద్లో కూడా బస్సులు కదలలేదు. తెరాస నాయకులు, కార్యకర్తలు బస్సు డిపోల ముందు బైఠాయించారు.
హైదరాబాదులో కూడా బస్సులు కదలడం లేదు. ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఖమ్మం డిపో ఎదుట తెరాస, సిపిఐ, సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. బయటకు రాకుండా బస్సులను అడ్డుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లా అంతా బస్సులు ఆగిపోయాయి. జిల్లాలోని 9 డిపోల్లో 700 బస్సులు ఆగిపోయాయి. హైదరాబాదులోని ఇమ్లిబన్ బస్సుల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఆగిపోయాయి. హైదరాబాదు నగర బస్సులకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. మెదక్ జిల్లా సంగారెడ్డి బస్సు ఎదుట తెరాస నేతలు బైఠాయించి, బస్సులను అడ్డుకున్నారు.
ఇంటర్ పరీక్షలు వాయిదా
తెలంగాణ బంద్ కారణంగా గురువారం జరగాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆరంభమయ్యాయి. గురువారం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గణితం - 1బి, 2బి, ఇతర గ్రూపుల పరీక్షలు జరగాల్సి ఉంది. వాయిదా వేసిన ఈ పరీక్షలను జూన్ 2 లేదా 3వ తేదీన నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇంటర్మీడియ్ విద్యా మండలి కార్యదర్శి రాంశంకర నాయక్ చెప్పారు.