తల్లితో సహజీవనం...కూతురుపై అత్యాచారం;కూతురును కొట్టి చంపిన తండ్రి
గుంటూరు జిల్లాలో లైంగిక అకృత్యాల పరంపర కొనసాగుతోంది. దాచేపల్లి, తెనాలి పాండురంగపేట, మోదుకూరు, కొల్లూరు ఘటనలు మరిచిపోక ముందే జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది.
తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి సెలవులకని ఇంటికి వచ్చిన మైనర్ అయిన ఆమె కుమార్తెని బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా బాలిక గర్భవతి అని తేలింది. దీంతో నివ్వెరపోయిన బాలిక తల్లి ఆ నీచానికి ఒడిగట్టింది తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...
పోలీసుల కథనం ప్రకారం...ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఓ మహిళ వదిలేసి వెళ్లి పోవడంతో కూలి పనుల నిమిత్తం తెనాలి ముత్తింశెట్టిపాలెం వచ్చి ఐదేళ్లుగా ఇక్కడే స్థిరపడిపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడి అతడితో కలసి సహజీవనం చేస్తోంది. ఈమెకు ముందే ఇద్దరు పిల్లలు సంతానం కాగా వీరిద్దరూ టంగుటూరులో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం తల్లి అనారోగ్యానికి గురైన క్రమంలో 16 ఏళ్ల కుమార్తె సపర్యల నిమిత్తం తెనాలికి వచ్చింది.
ఈ క్రమంలో బాలిక తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి కన్ను కుమార్తెపై పడింది. మాయమాటలు చెప్పాడో, బెదిరించాడో తెలియదు కానీ ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలిక తిరిగి టంగుటూరు వెళ్లిపోయింది. అయితే ఈ నెల 24న బాలికకు ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం రావడంతో తల్లి వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లగా వైద్యపరీక్షల్లో ఆమె గర్భవతి అని తేలింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన తల్లి...కుమార్తెను నిలదీయగా జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో రగిలిపోయిన ఆ తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు, పోక్సో చట్టంలో 5, 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ స్నేహిత మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు తాగిన మైకంలో విచక్షణ మరిచిన ఓ తండ్రి దివ్యాంగురాలైన ఏడేళ్ల కూతురును నేత కేసి కొట్టి చంపిన ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరులో చోటుచేసుకుంది. ఎర్రిస్వామి, ఉమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా పెద్దకుమార్తె సుమిత్ర పుట్టుకతోనే వికలాంగురాలు. మద్యానికి బానిసైన ఎర్రిసామి రోజూ తాగివచ్చి భార్యతో గొడవపడేవాడు కొట్టేవాడు. శనివారం రాత్రి కూడా ఇలా భార్యతో గొడవ పడి కొడుతుండగా దివ్యాంగురాలైన చిన్నారి సుమిత్ర పాక్కుంటూ వారి మధ్యలోకి వెళ్లింది. భార్య మీద కోపంతో సుమిత్రను ఎర్రిస్వామి ఒక్కసారి పైకిఎత్తి బలంగా నేలకేసి కొట్టాడు. దీంతో ఆమె ముక్కు నుంచి రక్తస్రావమైంది.
అయితే భర్తకు భయపడిన తల్లి కుమార్తె ముక్కు వెంబడి కారిన రక్తాన్ని శుభ్రపరచి నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది. అయితే అంతర్గత గాయాలతో రాత్రంతా తల్లడిల్లిన ఆ బిడ్డ ఆదివారం ఉదయం తల్లి లేచిచూసేసరికి నిర్జీవంగా కనిపించింది. దీంతో చట్టుపక్కలవారు వచ్చి చూసి బాలిక మృతి చెందినట్లు గుర్తించారు. బాలిక తల్లి ఉమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకున్నారు.