స్థానిక సంస్థల ఎన్నికలు .. ఆ పని చేస్తే అదిరిపోయే ఆఫర్ అంటున్న వైసీపీ సర్కార్
స్థానిక సంస్థల ఎన్నికలకు అటు అధికార వైసీపీ , ఇటు ప్రతిపక్ష టీడీపీ నేతలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి. ఎన్నికల బరిలో నువ్వా, నేనా అని తేల్చుకోటానికి రంగంలోకి దిగుతున్నాయి . స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇక ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ , టీడీపీని దెబ్బ కొట్టటానికి వైసీపీ రెడీ అవుతున్నాయి.
Recommended Video
ఏపీలో లోకల్ వార్ : నిఘా యాప్ తో అధికార వైసీపీ..కంట్రోల్ రూమ్ తో టీడీపీ
స్థానిక ఎన్నికలు .. 27న తొలి విడత, 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్తో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సన్నద్దమయ్యింది. మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఎన్నికల కమీషన్ మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించింది . ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు . ఈనెల 27న తొలి విడత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు.
పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలోని సర్కార్ కీలక నిర్ణయం
ఇక ముందుగా మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 9 నుంచి అంటే నేటి నుండి 11 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది . 14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు . ఈనెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక 29న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు . ఇక పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలోని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏకగ్రీవంగా ఎన్నికైతే గ్రామాలకు భారీ ప్రోత్సాహకాలు
ఇప్పటికే పార్టీ పరంగా బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అదనంగా ఇస్తామని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి .ఇక ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆయా గ్రామాలకు భారీ ప్రోత్సాహకాలు అందించనుంది ప్రభుత్వం. ఇక ఈ విషయంలోనూ తెలంగాణా ప్రభుత్వాన్ని అనుసరించింది ఏపీ సర్కార్ . ఏకగ్రీవమైన పంచాయితీ గ్రామ జనాభా బట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదును అందజేయనున్నట్టు పేర్కొంది.
ప్రభుత్వ ప్రోత్సాహకాల నిర్ణయం అందుకే
పంచాయతీ ఎలక్షన్స్ రాజకీయ పార్టీల గుర్తులతో కాకుండా పార్టీ రహితంగా జరుగునున్నాయి. అందుకే సర్కార్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. గ్రామాల్లో ఎన్నికల సందర్భంగా యుద్ధ వాతావరణం లేకుండా అంతా కలిసికట్టుగా ఉండేలా, ప్రజలంతా అభివృద్దిలో భాగం కావాలనే ప్రభుత్వాలు ఈ తరహా ప్రోత్సాహకాలను అందిస్తూ ఉండటం అనవాయితీగా వస్తోంది.ఇక ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంచాయతీరాజ్శాఖ ప్రభుత్వానికి నివేదించింది. మరో రెండు రోజుల్లో దీనిపై జీవో విడుదలయ్యే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెప్తున్నారు.