ఏపీ మంత్రుల సమర్ధతకు..సీఎం పరీక్ష: ఉంటారా..ఊడుతారా: జనవరి 10న పంచాయితీ సమరం..!
ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వకరించి సరిగ్గా నేటికి ఆరు నెలలు పూర్తయింది. తన పాలన మీద ప్రజాభిప్రాయం సేకరణకు ముఖ్యమంత్రి సిద్దమయ్యారు. అందు కోసం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే సీఎం జగన్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసారు. అందుకోసం అమ్మఒడి పధకాన్ని ప్రారంభించే తేదీని ముందుకు తెచ్చారు. సంక్రాంతి ముందే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు రంగం సిద్దమవుతోంది.
అదే సమయంలో ఈ ఎన్నికలకు..మంత్రుల రాజకీయ భవిష్యత్ కు సీఎం లింకు పెడుతున్నారు. అన్ని జిల్లాల్లో క్లీప్ చేయాలని సీఎం నిర్ధేశించారు. ఎక్కడ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చినా..మంత్రులదే బాధ్యత అని తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు ఇవి స్థానిక నేతలతో పాటుగా ముఖ్యమంత్రి మంత్రులుగా ఉన్న వారు ఉంటారా..ఊడుతారా తేల్చేవి గా మారుతున్నాయి.
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు పచ్చజెండా ..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. డిసెంబరు 15కు బ్యాలెట్ పేపర్లు సిద్ధం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఇక, జనవరి 9న అమ్మ ఒడి ప్రారంభించనున్నారు. ఆ మరుసటి రోజు అంటే జనవరి 10న రిజర్వేషన్ల జాబితా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో బ్యాలెట్ పేపర్ రంగుల పైనా చర్చ జరిగింది. వార్డు మెంబర్ ఎన్నికకు.. తెలుపు అదే విధంగా సర్పంచ్ ఎన్నిక కు గులాబి రంగు బ్యాలెట్ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సంక్రాంతికి ఎన్నికల సందడి..
సాధారణంగా సంక్రాంతికి పల్లెల్లో సందడిగా వుంటుంది. ఏపి పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో..ఆ సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం సొంత గ్రామాలకు వస్తుంటారు. దీంతో..అదే రాజకీయంగా వారి మద్దతు పొందటానికి సంక్రాంతి పండుగ సరైన సమయంగా భావిస్తున్నారు. దీంతో.. ఈసారి పండుగకు ముందుగానే గ్రామాల్లో మరింత సందడి ఏర్పడబోతోంది.
సంక్రాంతికి ముందే స్థానిక ఎన్నికల నగారా మోగటం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త సంవత్సర ప్రారంభం నుంచే హడావిడి ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే డిసెంబరు 15నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని సూచించినట్లు చెబతుున్నారు. జనవరి 10న పంచాయతీల రిజర్వేషన్లు ఫైనల్చేస్తే మరుసటి రోజునుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది..
మంత్రుల సమర్దతకు పరీక్ష..
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీ కేబినెట్ మంత్రుల సమర్ధతకు పరీక్షగా నిలవనున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీకి ఏకపక్షంగా ఏ విధంగా అయితే ఫలితాలు వచ్చాయో..అదే విధమైన తీర్పు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనిపించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఆ బాధ్యతను మంత్రులకు అప్పగించారు. ఇన్ ఛార్జ్ మంత్రులు..జిల్లా మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ఈ డిసెంబర్ చివరికి దేవాలయ..వ్యవసాయ మార్కెట్ కమటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు.
అదే సమయంలో..జిల్లాల వారీగా ఫలితాల ఆధారంగా మంత్రుల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పరోక్షంగా తేల్చి చెప్పారు. వైయస్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నాడు కాంగ్రెస్ రెండు చోట్ల పరాజయంతో ఇద్దరు మంత్రుల పైన వేటు వేసిన విషయాన్ని మంత్రులకు గుర్తు చేస్తున్నారు. దీంతో..రెండున్నారేళ్లు తాము పదవుల్లో ఉంటామని ఆశించిన మంత్రులకు..ఇప్పుడు ఈ ఎన్నికలు పరీక్షగా మారుతున్నాయి.