ఎన్నికల సిబ్బందికి కరోనా టీకా ఇవ్వండి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం
అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్లో పాల్గొనే ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.
ఇతర రాష్ట్రాల మాదిరిగా శానిటైజర్, మాస్కులు సరఫరా చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఫ్రంట్లైన్ వారియర్స్ తోపాటు సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్లో ఎన్నికల సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
ఇది ఇలావుంటే, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు ఉద్యోగులు మాత్రం విధులు నిర్వహించేందుకు విముఖత చూపుతున్నారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్ఈసీ తీరుకు నిరసనగా ఎన్నికల ప్రక్రియను బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు. అంతేగాక, తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదు లక్షల మంది ఉద్యోగులను ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వ్యవహారశైలితో ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు.
ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, ఎన్నికలు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చన్నారు. ఎన్నికల విధులకు హాజరుకాలేమని, అవసరమైతే కోర్టుకు వెళతామని అన్నారు. ఉద్యోగుల, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సంఘానికి తాము సహకరించబోమని, వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కాగా, శుక్రవారం రాత్రి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూలును ఏపీ ఎస్ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 మధ్య నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.