స్థానిక సంస్థల షెడ్యూల్ కు ముహూర్తం ఖరారు: మొదట జరిగేది వాటికే..: 15 రోజుల్లోనే మొత్తం..!
స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. గత నెలలోనే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఇప్పుడు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూలును వచ్చే జనవరి 9 లేదా 10 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తికానున్నట్లు తెలిసింది.
అమ్మఒడి..ఆ వెంటనే షెడ్యూల్
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రులను ఆదేశించారు. పార్టీ గెలుపు బాధ్యతలను వారికే అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే తొలుత జనవరి 26న అమలు చేయాలని భావించిన అమ్మఒడి పధకాన్ని సైతం ముందుకు తీసుకొచ్చి..జనవరి 9న అమలు చేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోగానే మార్కెట్ యార్డులు..దేవాలయ పాలకవర్గాలను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినా..కొన్ని జిల్లాల్లో మార్కెట్ యార్డులను మాత్రం భర్తీ చేసారు. దేవాలయ పాలక వర్గాల మీద ఈ వారం రోజుల్లో నియామకాలు పూర్తి అవుతాయని మంత్రులు చెబుతున్నారు.
15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసేలా..
ఈ ఏడాది జూన్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల పదవీకాలం ముగిసినప్పటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం వీటికి సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయకుండా కాలయాపన చేసింది. దీంతో ఎన్నికలు సకాలంలో జరగలేదు. మరోవైపు.. ఈ ఏడాది ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో.. పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వెంటనే నిర్వహించా లంటూ ఇటీవల హైకోర్టు ఆదేశించింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీల ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. గరిష్టంగా 15 రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న 13,065 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 1.30 లక్షల వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలి. వీటిని మూడు, నాలుగు దశల్లో నిర్వహించాల్సి ఉంటుంది. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైతే ఒకటి లేదా రెండు విడతల్లో పూర్తయ్యే అవకాశముంది.అవి ముగియగానే పది పదిహేను రోజుల వ్యవధిలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభించాలని అధికార వర్గాలు భావిస్తు న్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాల వారీగా బ్యాలెట్ పేపర్ల ముద్రణ, సామగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ త్వరలో ఖరారయ్యే అవకాశం ఉంది. దీని కోసం ఒకట్రెండు రోజుల్లో బ్యాలెట్ ముద్రణ టెండర్లు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.