బీజేపీకి జనసేన జలక్: టీడీపీతో కొత్త పొత్తులు: కమలంతో పవన్ మైత్రి అనుమానమే..!
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయంగా కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించాలని భావిస్తుంటే..టీడీపీ తిరిగి వామపక్షాలతో పొత్తులతో బరిలోకి దిగుతోంది. ఇక, జనసేన..బీజేపీ కలిసి పోటీ చేసే స్థానాల పైన కసరత్తు జరుగుతోందని రాష్ట్ర స్థాయి నేతలు చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్ధితి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ సమావేశం లో పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు ప్రతిపాదించిన సమయంలోనే..కొందరు నేతలు భిన్నంగా స్పందించారు. ఆ సమావేశంలోనే వైసీపీని ఎదుర్కోవాలంటే తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. కానీ, బీజేపీ..జనసేన మధ్య పొత్తు ఖరారైంది. స్థానిక ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు జనసేన నేతలు బీజేపీకి జలక్ ఇచ్చారు. టీడీపీతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల సమరంలోకి దిగుతు న్నారు. దీంతో..ఇప్పుడు ఇక బీజేపీ..జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.
టీడీపీతో జనసేన పొత్తులు
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎవరు ఏ స్థానంలో పోటీ చేయాలో..ఇప్పటికే నియమించుకున్న రెండు పార్టీల కమిటీలు నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 12న ఉమ్మడి మేనిఫెస్టో విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా 8 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయాలని షెడ్యూల్ సిద్దం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు సమయం ముగుస్తున్న వేళ..జనసేన నేతలు నేరుగా టీడీపీతో పొత్తుతో బరిలోకి దిగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ స్థానిక పోరులో గెలుపే లక్ష్యంగా కొత్త పొత్తు తెర మీదకు వచ్చింది. టీడీపీ, జనసేన ఒక కూటమిగా కొన్ని చోట్ల పోటీ చేస్తుంటే... మరికొన్ని చోట్ల టీడీపీ, వామపక్షాలు, జనసేన సర్దుబాట్లు చేసుకొంటున్నాయి.
ముమ్మిడివరంలో టీడీపీ జనసేన భేటీ
ముమ్మిడివరంలో సోమవారం టీడీపీ నాయకుడు తాడి నరసింహారావు ఇంట్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పితాని బాలకృష్ణ తదితరులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో 76 ఎంపీటీసీ స్థానాల్లో 13, నాలుగు జడ్పీటీసీల్లో ఒకటి, ముమ్మిడివరం నగర పంచాయతీ 20 వార్డుల్లో 2 స్థానాలు జనసేనకు కేటాయించేలా నిర్ణయించుకున్నారు. పి గన్నవరం మండల స్థాయిలోనూ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఖరారైనట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ కు తెలిసే జరిగిందా..
ఇప్పుడు. ఈ మొత్తం వ్యవహారం జనసేన అధినేత పవన్ అనుమతితో జరిగిందా..లేక స్థానిక నేతలే అత్యుత్సాహం ప్రదర్శించి..ఈ ఒప్పందం చేసుకున్నారా అనే చర్చ మొదలైంది. ఇదే తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుండి జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ గెలిచారు. తొలుత జనసేన అధినేత నిర్ణయాలకు అనుగుణంగా పని చేసినా..ఇప్పుడు పూర్తిగా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయినా..పవన్ కళ్యాణ్ ఆయన మీద ఎటువంటి చర్యలకు దిగలేదు.
Recommended Video
క్షేత్ర స్థాయిలో జనసేనకు ఇబ్బందికర పరిస్థితులు
ఇదే సమయంలో ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీతో పొత్తు గురించి మాట్లాడి ఖరారు చేసుకున్న పవన్ కు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బంది గా మారుతున్నాయి. అయితే, టీడీపీతో స్థానికంగా పొత్తుల విషయంలో పవన్ అనుమతి ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో బీజేపీ నేతలు జనసేనతో పొత్తు అని చెబుతూనే..ఢిల్లీ స్థాయిలో మాత్రం సీఎం జగన్ తో మైత్రి కోరుకుంటన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు స్థానికంగా టీడీపీ నేతల ట్రాప్ లో జనసేన నేతలు పడ్డారా..లేక ఇదంతా ప్రణాళిక మేరకే జరిగిందా అనేది జనసేన స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇక, దీని పైన బీజేపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.