చంద్రబాబు పర్యటనలో జై జగన్ నినాదాలు..బాబు సీరియస్ : వరద బాధితుల రియాక్షన్ తో..!!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాలో వదర బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఆ సమయంలో బాధితుల వద్ద ప్రభుత్వ వైఫల్యాల గురించి చంద్రబాబు ప్రస్తావించారు. దీంతో..ఊహించని విధంగా ఒక్కసారిగా స్థానికుల నుండి నినాదాలు మొదలయ్యాయి. జై జగన్ అంటూ నినాదాలు చేసారు. దీంతో..చంద్రబాబు ఒక్క సారిగా సీరియస్ అయ్యారు. నినాదాలు చేయటం కాదు...మీ నేతలను తీసుకొచ్చి పనులు చేయించండి అంటూ అక్కడ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక్కడ నినాదాలు ఇవ్వటం..అరవటం చేస్తే .. జాగ్రత్త ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఈ పరిణామంతో అక్కడ ఉన్న స్థానిక టీడీపీ నేతలు విస్తుపోయారు.
చంద్రబాబు పర్యటనలో జై జగన్ నినాదాలు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు..కొల్లూరు మండాల్లోని వదర ప్రభావిత లంక గ్రామాల్లో ఆయన పర్యటించారు. స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆయన ప్రభుత్వ తీరు పైన మండి పడ్డారు. వరద నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇది ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా తీసుకొచ్చిన వరదలంటూ ఫైర్ అయ్యారు. బాధితులకు అండగా నిలవటంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కనీసం బాధితులకు మంచినీరు..నిత్యావసరాలు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ప్రజలు కష్ట కాలంలో ఉంటే మంత్రులు..అధికార పార్టీ నేతలు పట్టించుకోవటం లేదని..టీడీపీ శ్రేణులు బాధితులకు అండగా నిలవాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి తన హాయంలో వరదలు..తుఫాన్లు వచ్చిన సమయంలో ఏ రకంగా వ్యవహరించిందీ గుర్తు చేసారు. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న సమయంలోనూ అనూహ్యంగా స్థానికుల నుండి స్పందన వ్యక్తం అయింది. బాధితులకు సాయం అందించటంలో ప్రభుత్వం విఫల మైందంటూ చంద్రబాబు చెబుతున్న సమయంలోనే..కొందరు స్థానికులు ముఖ్యమంత్రికి అనుకూలంగా జై జగన్ అంటూ నినాదాలు చేసారు. వారిని వారించిన వినిపించుకోలేదు. స్థానికంగా ఉన్న టీడీపీ నేతల తీరు మీద ఆరోపణలు చేసారు.
మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం..
స్థానికులు ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేయటంతో ఒక్క సారిగా చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు వారికి అనుకూలంగా నినాదాలు చేయండి..ఇబ్బంది లేదు...మంత్రులను తీసుకొచ్చి గ్రామాల్లో పనులు చేయించండి...అంతే కానీ ఇక్కడ అరిస్తే చూస్తూ ఊరుకోను అంటూ సీరియస్ అయ్యారు. కొల్లూరు మండలం పోతార్లంకలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోకి రాకుండా పేద వారిని రోడ్డున పడేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇది సరికాదని జనం చెప్పారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారని.. భోజనం, మంచి నీరు అందించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారని స్థానికులు వివరించే ప్రయత్నం చేసారు. దీంతో చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మీరు మాట్లాడొద్దు.. నేను రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు.. పేద ప్రజల తరఫున పోరాడటానికి వచ్చాను.. ఎవరినీ వదిలిపెట్టను.. నా నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మంత్రులు...అధికార పార్టీ నేతల సంగతి తేలుస్తాం అంటూ ఊగిపోయారు. దీంతో స్థానికులు జై జగన్.. అంటూ నినాదాలు చేశారు. తిప్పలకట్టలో సమస్యలు చెప్పాలని చంద్రబాబునాయుడు ప్రజలను కోరగా.. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు ప్రోత్సాహమివ్వడంతో తమకీ దుస్థితి తలెత్తిందని చంద్రబాబుకు వివరించారు.
హీటెక్కుతున్న వరద రాజకీయం..
ఏపీలో ఎన్నికలు ముగిసి..కొత్తగా ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు ఇంకా పూర్తి కాలేదు. కానీ, ఎన్నికల ముందు తరహా వాతావరణం ఏపీలో కనిపిస్తోంది. ప్రతీ అంశం మీద వివాదం చెలరేగుతోంది. వరదల మీద అధికార ..ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉండటంతో మంత్రులు బాధ్యత తీసుకున్నారు. అయితే, వరదలను వదిలేసి ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లారంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి పరామర్శ కోసం రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి బొత్సా సత్యానారాయణ రాజధాని గురించి చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి మరింతగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఏపీలో వరద తో మొదలైన రాజకీయంగా..రాజధాని వైపుకు మళ్లింది.