దేశంలో నిరాటంకంగా ఎన్నికలు- త్వరలో రాజస్ధాన్, గుజరాత్లో- ఏపీలోనే విచిత్ర పరిస్ధితి
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత నిరాటంకంగా ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఉపఎన్నికలైనా, స్ధానిక సంస్ధలైనా, రాజ్యసభ ఎన్నికలైనా వేటికీ మినహాయింపు లేదు. ఎన్నికలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యక్తులు కోర్టులను ఆశ్రయిస్తున్నా ఎదురుదెబ్బలు తప్పడం లేదు. దీంతో దేశంలో పెండింగ్లో ఉన్న ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్దితులు అనుకూలంగానే ఉన్నాయని కోర్టులు కూడా అభిప్రాయపడుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం జగన్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్గా సాగుతున్న పోరు స్ధానిక సంస్ధల ఉసురుతీస్తోంది. ఎన్నికలు జరిగితే తప్ప కేంద్రం నుంచి నిధులు రావని తెలిసినా సర్కారు మొండిపట్టు పడుతోంది.
Recommended Video
వైసీపీకి ప్రతిష్టాత్మకంగా తిరుపతి పోరు- అభ్యర్ధి మార్పుపై ప్రచారం- స్ధానిక పోరుకు ముందే
దేశవ్యాప్తంగా ఎన్నికలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తగ్గగానే స్ధానిక ఎన్నికల నిర్వహణ తిరిగి ప్రారంభమైంది. స్ధానిక సంస్ధల ఎన్నికలే కాదు ఏకంగా అసెంబ్లీ ఎన్నికలే నిర్వహించిన చరిత్ర బీహార్లో చూశాం. మరో ఏడాది ఆగితే జమిలి ఎన్నికలకు సైతం దేశం వెళ్లబోతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాజాగా ఈ నెలలోనే రాజస్ధాన్లో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే నెలలో గుజరాత్లో స్ధానిక పోరుకు ఇప్పటికే షెడ్యూల్ వెలువడింది. దీంతో దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు కరోనా కానీ, కరోనాకు ఇస్తున్న వ్యాక్సిన్ కానీ అడ్డుకాదని తేలిపోతోంది.
కరోనా తర్వాత జరిగిన ఎన్నికలివే..
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గాక నిర్వహించిన ఎన్నికల విషయానికొస్తే.. ముందుగా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకూ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. నవంబర్ 3న మధ్యప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, నాగాలాండ్, ఒడిశా, ఛత్తీస్ఘడ్, హర్యానాలో పలుచోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. నవంబర్ 7న మణిపూర్, బీహార్లో ఉపఎన్నికలూ జరిగాయి. నవంబర్ 9న ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. నవంబర్, డిసెంబర్లో రాజస్దాన్లో జిల్లా పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు, 8 నుంచి 14 వరకూ కేరళ స్ధానిక సంస్ధల ఎన్నికలూ నిర్వహించారు. ఆ తర్వాత కర్నాటకలోనూ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. తాజాగా జనవరి 15న మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ నెలలోనే రాజస్దాన్లో మిగిలిన స్ధానిక సంస్ధల ఎన్నికలు, వచ్చేనెలలో గుజరాత్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
ఏపీలోనూ ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు
అంతెందుకు ఏపీలోనూ శాసనమండలికి ఉప ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు కరోనాలోనే పూర్తయ్యాయి. ప్రజాప్రతినిధులకు కరోనా ముప్పు ఉందని తెలిసినా, వీటికి హాజరైన పలువురికి కరోనా సోకినా లెక్కచేయకుండా అప్పట్లో ఎన్నికలు నిర్వహించారు. తొలుత గతేడాది ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. అనంతరం ఎమ్మల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్ధానానికి ఉప ఎన్నిక జరిగింది. అనంతరం పోతుల సునీత రూపంలో మరో ఉపఎన్నిక వచ్చినా ఓటింగ్ అవసరం లేకుండానే ఏకగ్రీవమైంది. అంటే ఏపీలోనూ ప్రజాప్రతినిధులే ముందుండి ఓటేసిన పరిస్ధితులూ కరోనాలోనే చూశాం.
స్ధానిక సంస్ధల ఉసురుతీస్తున్న జగన్, నిమ్మగడ్డ పోరు
మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు యథావిథిగా జరిగిపోతున్నా ఏపీలో మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగడం లేదు. సార్వత్రిక ఎన్నికలు వచ్చినా జరిపిస్తాం కానీ స్ధానిక సంస్ధల ఎన్నికలు మాత్రం జరగకూడదన్న పట్టుదలతో జగన్ సర్కారు పావులు కదుపుతున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ను కూడా మిగతా అధికారులతో పాటే చూస్తే సరిపోయే దానికి ఆయనపై కుల విమర్శలు చేసి టార్గెట్ చేసిన వైసీపీ సర్కారు.. ఇప్పుడు ఆయన కొరడా ఝళిపిస్తారన్న భయంత ఆయన హయాంలో ఎన్నికలంటేనే భయపడే పరిస్దితికి వచ్చేసింది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా ఎన్నికలు జరుగుతాయని స్ధానిక సంస్ధలు ఎదురుచూస్తున్నాయి. అంతిమంగా జగన్, నిమ్మగడ్డ పోరు స్ధానిక సంస్ధల ఉసురుతీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.