లోకల్ వార్ .. ఆ గ్రామ పంచాయితీలకు ఏపీ సర్కార్ బంపర్ బొనాంజా
స్థానిక సంస్థల ఎన్నికలపోరు కొనసాగుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎలక్షన్స్తో పాటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అయ్యింది . మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన ఎన్నికల కమీషన్ మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించింది . ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు . ఈనెల 27న తొలి విడత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ధీమా అదేనా ? క్లీన్ స్వీప్ చెయ్యటం సాధ్యమేనా ?
గ్రామాల్లో సర్పంచ్లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆయా గ్రామాలకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఏకగ్రీవమైన పంచాయితీ గ్రామ జనాభా బట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదును అందజేయనున్నట్టు పేర్కొంది.ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన పంచాయతీలకు ఏపీలోని వైసీపీ సర్కార్ నజరానాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నజరానాను జనాభా ప్రాతిపదికన విభజించింది .
4 విభాగాలుగా విభజించిన సర్కార్ 2 వేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ. 5 లక్షలు, 2 నుండి 5 వేల లోపు ఉంటే రూ. 10 లక్షలు, 5వేల నుండి 10 వేల లోపు జనాభా ఉంటే రూ. 15 లక్షలు, 10 వేల జనాభా దాటిన గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమైతే రూ. 20 లక్షలు నజరానా ఇవ్వనున్నారు.పంచాయతీ ఎలక్షన్స్ రాజకీయ పార్టీల గుర్తులతో కాకుండా పార్టీలకు అతీతంగా నిర్వహించనున్నారు . అందుకే సర్కార్ ఈ ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనిపై ఉత్తర్వులను జారీ చేస్తూ జీవో ఇచ్చింది.