సీన్ రివర్స్: ఎక్సైజ్ అధికారులపై 100 మంది దాడి, రాళ్లతో తెగబడి మరీ, కారు అద్దాలు ధ్వంసం..
గుడుంబా కాయడం నిషేధం. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తోందని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి ఏ మారుమూల ప్రాంతంలోనైనా.. గుడుంబా బట్టి ఉంటే.. ఇక అంతే సంగతులు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తుంటారు. ఇదీ సర్వసాధారణం.. వారికి ప్రభుత్వం హక్కు కల్పించింది. కానీ గుంటూరులో మాత్రం గుడుంబా బట్టిపై ఎక్సైజ్ అధికారులు దాడి చేస్తే.. సీన్ రివర్సైంది. అక్కడున్న స్థానికులు వందమంది వరకు పోలీసులపై దాడికి తెగబడ్డారు. వినడానికి, చదవడానికి కాస్త వింతగా ఉన్న ఇదీ నిజం.
మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో మంగళవారం స్థానికులు రెచ్చిపోయారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న మాచర్ల ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి సహా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. వంద మంది వరకు పోలీసులపై దాడి చేశారు. 15 మంది రాళ్లతో దాడి చేయడంతో కొండారెడ్డి సహా సిబ్బంది గాయపడ్డారు. వారు వచ్చిన కారును కూడా వదల్లేదు. కారు అద్దాలను ధ్వంసం చేశారు.
గతనెలలో కూడా 7 వేల లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. మరోసారి రావడంతో.. తమను కావాలనే టార్గెట్ చేశారని భావించారు. అధికారులకే బుద్దిచెప్పాలనుకొని మరీ అటాక్ చేశారు. ఎక్సైజ్ అధికారుల సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. సీఐ కొండారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.