జనాల ఫిర్యాదు: టీవీ కోసమే.. చంద్రబాబు గురించి దేశానికి చెప్తానని జగన్
గుంటూరు: తమ గోడును ఎవరూ పట్టించుకోవట్లేదని గుంటూరు జిల్లాలోని రాజుపాలెంలో స్థానికులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంగళవారం నాడు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
జగన్ గుంటూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్నారు. మంగళవారం రాజుపాలెం మండలం అనుపాలెంలోని వరద బాధిత ఎస్టీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు జగన్కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎవరూ పట్టించుకోవట్లేదని ఫిర్యాదు చేశారు. ఇంత వరకు అధికారులు రాలేదన్నారు.
పంచాయతీలో పనులు చేసినా అడ్డుకుంటున్నారని, పంచాయతీ నిధులు ఉన్నా, పనులకు అడ్డు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా తమ బాధలు చెప్పుకున్నారు. అనంతరం జగన్ దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించారు.
అనంతరం జగన్ మాట్లాడారు. సీఎంగా ఉన్న చంద్రబాబు హెలికాప్టర్లలో తిరగడానికే సరిపోయిందని, కానీ వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించే తీరిక లేదని విమర్శించారు. వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే ప్రజల ఇబ్బందులు తెలిసేవన్నారు. టీవీల్లో కనిపించడం కోసం చంద్రబాబు హెలికాప్టర్లో తిరిగారన్నారు.
గ్రామాల్లోకి ఒక్క అధికారి కూడా రాలేదని, దమ్మిడి సాయం చేయలేదన్నారు. గుంటూరు జిల్లాలో మూడు లక్షల ఎకరాల పత్తి, లక్ష నుంచి రెండు లక్షల ఎకరాల్లో మిరప వేశారన్నారు. అందులో ముప్పావు వంతు పంటలు నీట మునిగాయన్నారు. గత ఏడాది ఇన్ పుట్ సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.
రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. ఇప్పుడు బంగారం పైన రుణాలివ్వవద్దని చెబుతున్నారని ఆరోపించారు. బ్యాంకులు రుణాలివ్వక, అప్పులు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పిల్లనిచ్చిన మామనే కాకుండా, ఓట్లు వేసిన వారిని కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల చంద్రబాబు పర్యటించారని, కానీ ఎలాంటి మార్పు లేదన్నారు. బాధితులకు ఏమాత్రం సాయం అందకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రంతో పాటు, దేశం మొత్తం తెలియజేస్తానన్నారు. ఇటువంటి సీఎం దేశంలో ఎక్కడా లేరని, ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు అండగా నిలవాలన్నారు.