మురళీమోహన్ను అడ్డుకున్నారు, రాజధానిపై మంత్రి
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మురళీ మోహన్, మాగంటి బాబులకు పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానికులు షాకిచ్చారు. వారిని స్థానికులు అడ్డుకోవడంతో ఏలూరు జెడ్పీ కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. కోడీ పందాలను నిర్వహించవద్దని పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో స్థానికులు మురళీ మోహన్, మాగంటి బాబులను అడ్డుకున్నారు. అరెస్టైన తమ వారిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ వారిని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. కాగా, కోడి పందేలు నిర్వహిస్తున్న 300 మంది పైన బైండోవర్ కేసులు పెట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
కుట్రలు చేసినా అద్భుతమైన రాజధానిని నిర్మిస్తాం: నారాయణ
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు ప్రాంతంలో అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కొన్ని శక్తులు కావాలనే రాజధానిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాజధానిని ఆపే ప్రసక్తే లేదన్నారు.
మంగళవారం ఉదయం అగ్నిప్రమాదానికి గురైన తాడేపల్లి, తుళ్లూరు ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. అగ్నిప్రమాదానికి గురైన పంట పొలాలను పరిశీలించిన ఆయన బాధిత రైతులను పరామర్శించారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.
వైద్య పరీక్షలు చేయించుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆస్పత్రిలో జనరల్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బీపీ, షుగర్కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు సుదీర్ఘకాలంగా నిర్విరామంగా పని చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
నిన్న గుంటూరులో జిల్లాలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలపై కూడా సీఎం చంద్రబాబు కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ప్రమాదానికి సంబంధించి సమాచారం తెప్పించుకునే నిమిత్తం ఆయన కొంత అలసటకు గురయ్యారని టీడీపీ వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే ఈ రోజు సీఎం చంద్రబాబు వైద్యపరీక్షలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.