వారసులం మేమైతే....తవ్వడానికి మీరెవరు?...చెన్నంపల్లికోటలో కొత్త ట్విస్ట్
కర్నూలు జిల్లా: చెన్నంపల్లికోట తవ్వకాలలో ఎవరూ ఊహించని సరి కొత్త ట్విస్ట్ ఇది. ఈ కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ రహస్య తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఇక్కడ తవ్వకాలు జరిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రోజు జరిగిన ఒక ఘటన ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.
Recommended Video
చెన్నంపల్లికోట వారసులమంటూ త్రివిక్రమరాజు అనే వ్యక్తి ఈరోజు అధికారులను కలిశారు. ఈ కోటకు తాము వారసులమని, తమ అనుమతి లేకుండా ఇక్కడ తవ్వకాలు జరపడం చెయ్యరాదని అధికారులకు తెలిపాడు. కోట వంశవృక్షం మ్యాప్ను కూడా ఆయన అధికారులకు చూపించారు. త్రివిక్రమరాజు కర్నూలు జిల్లా అవుకు వాసి. అధికారులు వెంటనే తవ్వకాలు ఆపకపోతే తాను కోర్టును ఆశ్రయిస్తామని త్రివిక్రమరాజు హెచ్చరిస్తున్నారు.
చెన్నంపల్లి కోటలో విలువైన ఖనిజ నిక్షేపాలు, నిధి అన్వేషణ కోసం అధికారుల సమక్షంలో 12 రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు తవ్వకాల్లో నిధి నిక్షేపాల సంగతేమో కానీ గుర్రాలు,ఇతర జంతువుల ఎముకలు, ఏనుగు దంతాలు, ఇటుకలు వెలుగు చూశాయని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా మాత్రం నిధి దొరికిందని, అలాంటివి చాలా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటుకలు, ఎముకలు, ఏనుగు దంతాలు ఆర్కియాలజీ (పురావస్తు) శాఖ పరిధిలోకి వస్తాయని, ఆ శాఖ అధికారుల పర్యవేక్షణలోనే తవ్వకాలు సాగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ తవ్వకాల్లో నిధి నిక్షేపాలు వెలుగు చూస్తే వాటిని పటిష్ఠమైన రక్షణ మధ్య భద్రపరిచి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కలెక్టర్ ఇప్పటికే వివరణ ఇవ్వడం గమనార్హం.