ఏపీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం: ఈ-అడ్మిషన్స్ ద్వారా విద్యార్థులకు ఇంటర్ అడ్మిషన్స్
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విద్యావ్యవస్థకు కూడా చాలా ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థుల పరీక్షల సమయంలో ఈ నిర్ణయం రావడం పరీక్షలు వాయిదా పడటం విద్యార్థులను నిరాశకు గురిచేసింది. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు కూడా వాయిదా వేయడం జరిగింది. అయితే కరోనావైరస్ వ్యాప్తి చెందకూడదని భావిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. అంతేకాదు స్కూళ్లు కాలేజీలను కూడా మూసివేయాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు గుంపులు గుంపులుగా గుమికూడుతుండటంతో అలాంటి గుంపుల నివారణకు ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . ఈ క్రమంలోనే ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్ మరో నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ కారణంగా అన్ని కాలేజీలు మూతపడటంతో ఇంటర్ మొదటి సంవత్సరంలోకి విద్యార్థులను ఈ-అడ్మిషన్స్ ద్వారా అడ్మిట్ చేసుకునేలా కీలక ఆదేశాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం 2020-21కి ఆన్లైన్ ద్వారా ఈ- అడ్మిషన్స్ ఇవ్వాలని ఏపీ ఇంటర్ బోర్డు డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఇప్పటికే అంటే మార్చి 3వ తేదీనే ఒక సర్క్యులర్ కూడా విడుదలైంది.
ఇక అడ్మిషన్ ప్రక్రియ ఎలాగుంటుంది అనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ (bie.ap.gov.in)లో పొందుపరుస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అంతేకాదు ఇంటర్ కాలేజీల్లో తమ నేరుగా అడ్మిషన్లు తీసుకోకూడదని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించింది.
ఏపీ ఇంటర్ బోర్డు అనుబంధ కాలేజీలుగా కొనసాగుతున్న కొన్ని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు అడ్మిషన్ ప్రక్రియను మొదలు పెట్టాయనే ఫిర్యాదు అందడంతో ఏపీ ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అడ్మిషన్లు ఇవ్వడమే కాదు ఫీజులు కూడా వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు అందాయి. ఇదిలా ఉంటే ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏపీలో మార్చి 5న ప్రారంభమై మార్చి 23న ముగిశాయి.