లాక్ డౌన్ టైమ్ పాస్ ... పేకాట , కోడిపందేలు .. తోలు తీస్తున్న పోలీసులు
కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో ప్రజలు ఇళ్ళకు పరిమితం కావాల్సి వస్తుంది. అయితే చాలా మంది ఖాళీగా ఉండలేక పేకాట , కోడి పందేలపై దృష్టి పెట్టారు. పోలీసులకు దొరక్కుండా సీక్రెట్ గా గుంపులుగా చేరి జోరుగా పేకాట , కోడి పందేలు ఆడుతున్నారు . ఇక ఈ పరిస్థితి పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది .
ఏపీ సీఎస్ నీలం సాహ్నికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ ... ఏ విషయంలో అంటే
జోరుగా పేకాట స్థావరాలు.. ఆటలో మునిగితేలుతున్న జూదగాళ్ళు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండడానికి ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం, పోలీసులు చెబుతున్నప్పటికీ కొంత మంది పాటించడం లేదు. పేకాట రాయుళ్లు అందరూ ఒక చోట గుమిగూడి పేకాట ఆడుతున్నారు.పని పాట లేకపోవటంతో జూదగాళ్ళు పేకాట బాట పట్టారు . నిత్యం ఎక్కడో ఒక చోట పేకాట రాయుళ్ళు పట్టుబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
మొన్న వనపర్తిలో , తాజాగా క్రోసూరులో పేకాటరాయుళ్ళను పట్టుకున్న పోలీసులు
పోలీసులు లాఠీలకు పని చెప్పినా , గట్టిగా హెచ్చరించినా ,కేసులు పెట్టినా వారిలో మార్పు రావటం లేదు . ఇక తాజాగా గుంటూరు జిల్లాలోని క్రోసూరులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు స్థావరాలపై దాడి చేశారు. పోలీసులను చూసి పేకాటరాయుళ్లతో పాటు అక్కడ ఉన్న ప్రజలు పరిగెత్తారు. పోలీసుల దాడిలో ఓ వ్యక్తి గాయపడి అక్కడే పడిపోయాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో కూడా వనపర్తి జిల్లా కేంద్రంలో కొందరు పేకాట ఆడుతున్నారని అందుకున్న సమాచారంతో పోలీసులు దాడి చేసి అక్కడ పట్టుబడిన వారిని అర్ధ నగ్నంగా నడిరోడ్డు మీద నడిపిస్తూ తీసుకువెళ్ళారు.
తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడిపందేలు
ఒకపక్క లాక్ డౌన్ తో సామాజిక దూరం పాటించాలని పోలీసులు చెప్తుంటే కొందరు ప్రబుద్ధులు మాత్రం ఈ తరహా పనులకు దిగుతున్నారు . ఇక ఇదే సమయంలో తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరందుకున్నాయి . తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు రైల్వేగేటు వద్ద కోడి పందేలు కాస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ కోడిపందేలు వేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.31,180 నగదు, రెండు కోళ్లు, మూడు సెల్ ఫోన్లు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
లాఠీలకు పని చెప్తున్న పోలీసులు .. కేసులు నమోదు
ఇక గుట్టు చప్పుడు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో జోరుగానే కోడి పందేలు , పేకాట స్థావరాలు నడుస్తున్నాయి . ఒక పక్క లాక్ డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు వీరిని పట్టుకోవటం పెద్ద పనిగా మారింది . ఏది ఏమైనా నిత్యం వెలుగు చూస్తున్న ఘటనలు లాక్ డౌన్ నేపధ్యంలో జరుగుతున్న అసాంఘిక కార్యాకలాపాలకు అద్దం పడుతున్నాయి. ఒక పక్క లాక్ డౌన్ విధించి కరోనా వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటించాలని చెప్తుంటే గుంపులుగా , రహస్యంగా ఇలా కొందరు ప్రబుద్ధులు చేస్తున్న నిర్వాకాలు పోలీసులకు చిరాకుగా మారాయి . అందుకే కేసులు పెట్టి , లాఠీలకు పని చెప్పి మరీ బుద్ధి చెప్పే పనిలో ఉన్నారు .
Recommended Video