పరీక్షా సమయంలో లాక్ డౌన్ .. ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు
ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇప్పటివరకు ఏపీలో 473 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఇక ఈ నేపధ్యంలో బాగా సమస్యాత్మక ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి ప్రభుత్వం అక్కడ ఆంక్షలు కఠినతరం చేసింది . ఇక లాక్ డౌన్ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అన్నదానిపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే తాజా పరిణామాల నేపధ్యంలో ఇప్పుడు నిర్వహించలేమంటూ ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.
ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు మరింత పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే పదోతరగతి విద్యార్థులకు స్కూల్స్ లాక్ డౌన్ కారణంగా బంద్ కొనసాగుతున్న క్రమంలో టెన్త్ పరీక్షలు ముగిసేవరకు విద్యార్థులకు ఆన్లైన్ పాఠాల బోధన చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారని మంత్రి సురేష్ చెప్పారు . ఇందుకోసం విద్యామృతం పేరుతో కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు .ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 11వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సప్తగిరి చానెల్ ద్వారా పాఠాలు ప్రసారం చెయ్యనున్నామని తెలిపారు.
విద్యార్థులు సమయం వృధా చెయ్యకుండా చదువుకోవాలని, ఆన్ లైన్ తరగతులు సప్తగిరి ఛానల్ ద్వారా జరుగుతాయని తెలిపారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అయితే ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు అన్ని శాఖల పరిధిలోని స్కూల్స్ నుంచి టీచర్ల ఎంపిక చేస్తున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉత్సాహం ఉన్న టీచర్స్ ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక విద్యార్థులు కరోనా ప్రభావం తగ్గగానే పరీక్షలు ఉంటాయని , దానిని దృష్టిలో పెట్టుకుని చదువుకోవాలని మంత్రి తెలిపారు.