లాక్ డౌన్ ప్రాబ్లమ్... వారికి స్పెషన్ పాసులు ఇవ్వాలని ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం
ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు అటు సామ్యులకే కాదు, నిత్యావసర వస్తువులు విక్రయించే వారికి సైతం ఇబ్బందిగా మారింది. రోడ్ల మీద కనిపిస్తే పోలీసులు ఆపి ఇబ్బంది పెడుతున్నారన్న భావన బాగా పెరిగిపోయింది. నిత్యావసరాలు అమ్మే షాపుల యజమానులు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు . ఇక నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాలు, ఆ కంపెనీలలో పనిచేసే వ్యక్తులకు బయటకు వెళ్లేందుకు అనుమతి ఉన్నా సరే చాలా చోట్ల పోలీసులతో తిప్పలు తప్పటం లేదు .
పోలీసులు ప్రజలను ఆపినట్టే , నిత్యావసరాలను తీసుకువెళ్ళే వారిని , వారి వాహనాలను ఆపుతుండటంతో కొన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దీంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాల రవాణాకు సంబంధించి ఈ పాస్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది . వివిధ మార్ట్ లలో , పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల్లో పని చేసే వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే, ఈ పాస్ లు పొందవచ్చు.
దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్ లేదా ఫోన్కు అనుమతులు వస్తాయి. ఈ పాస్లు కూడా ఆయా కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే ఇస్తారు.ఇక ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఏపీ సర్కార్ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తుంది. అందుకోసం సాధ్యమైనంత వరకు ఇళ్లకే వెళ్లి వారికి కావలసిన నిత్యావసరాలు అందించే విధంగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. మరోపక్క నిత్యావసరాలను అందించే క్రమంలో ఇబ్బంది పడుతున్న వారికి ప్రత్యేక పాసులు ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని భావిస్తుంది.