కరోనా ఎఫెక్ట్ : గుంటూరు జిల్లాలో ఇక సరి సంఖ్య దినాల్లోనే షాపింగ్...
ఏపీలో అత్యధిక కరోనా కేసులున్న జిల్లాగా నమోదైన గుంటూరులో షాపింగ్ పై మరిన్ని కఠిన ఆంక్షలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీ తరహాలో సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
గుంటూరులో సరి-బేసి విధానం...
గుంటూరు జిల్లాలో ఇప్పటివరకూ 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి ఏపీలోనే అత్యధికం. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి కారణంగా ప్రబలిన వైరస్ ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం ఇక్కడ షాపింగ్ ను మరింత పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజు విడిచి రోజు మాత్రమే షాపింగ్ కు అనుమతించనున్నారు. ఇకపై నెలలో సరి సంఖ్య దినాల్లో మాత్రమే షాపులు, దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించిన అధికారులు.. ఈ దినాల్లోనే నిత్యావసరాలు కొనుక్కోవాలని కోరారు.
షాపింగ్ వేళల్లోనూ కోత..
గుంటూరు జిల్లాలో నమోదవుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని షాపింగ్ ను సరి సంఖ్య రోజులకే పరిమితం చేసిన ప్రభుత్వం.. ఆ రోజుల్లోనూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా ద్విచక్ర వాహనం పైన ఒక్కరు, కారు వంటి వాహనం పైన ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ఎవరు ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదని, నిత్య అవసరాల నిమిత్తం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి, రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన చోట్ల తీసుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని, మాస్కులు లేకుండా ఎవరు బయట తిరుగరాదని, మిగిలిన సమయాలలో మందుల షాపులు, అత్యవసర ఆసుపత్రులు మినహా మిగిలినవన్నీ మూసి వేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులపైనా...
గుంటూరు జిల్లాలో తాజా పరిస్ధితి దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లేవారు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు వెళ్లి, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇతరులు ఎవరు తిరుగరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల మేరకు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు అర్బన్ డీఐజీ పీ.హెచ్.డి రామకృష్ణ తెలిపారు.
Recommended Video