లోకసభలో అనూహ్య పరిణామాలు: ఖర్గేపై దాడికి యత్నం, వారించిన సోనియా గాంధీ
Recommended Video
న్యూఢిల్లీ: లోకసభలో మంగళవారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు అవిశ్వాస తీర్మానం అంశం వేడిని రాజేస్తుంటే, మరోవైపు కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే సభ్యులు సభలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. టీడీపీ, వైసీపీలు అవిశ్వాస నోటీసు ఇస్తోంది మొదలు ఇలాగే జరుగుతోంది.
అవిశ్వాసం.. చర్చకు సిద్ధమని బీజేపీ
ఇటీవలి వరకు టీడీపీ, వైసీపీలు మాత్రమే అవిశ్వాసం నోటీసు ఇచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్, ఆర్ఎస్పీ, సీపీఎం పార్టీలు కూడా ఇచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్చకు బీజేపీ కూడా సిద్ధమని చెప్పింది. కానీ అన్నాడీఎంకే సభ్యులు తమ రాష్ట్రం కోసం ఆందోళన మానుకోవడం లేదు.
లోకసభలో అనూహ్య పరిణామాలు
ఈ నేపథ్యంలో మంగళవారం లోకసభలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత బాహాబాహీకి దిగారని తెలుస్తోంది. కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గేపై అన్నాడీఎంకే సభ్యులు దాడికి ప్రయత్నించారని తెలుస్తోంది.
ఖర్గే డిమాండ్
మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. అన్నాడీఎంకే సభ్యులు కావాలనే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై అన్నాడీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఆందోళనలు చేస్తున్నామని చెప్పారు.
ఖర్గేపై దాడికి యత్నం
ఈ సమయంలో ఇరుపార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఖర్గేపై దాడికి ప్రయత్నించారని తెలుస్తోంది. వారిని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వారించారు. ఇతర ఎంపీలు కూడా ఇరుపక్షాలను వారించారు. కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలకు సర్ది చెప్పారు. ఇరు పార్టీల మధ్య తోపులాట జరిగింది. మార్షల్స్ సర్ది చెప్పారు.