తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా: బాబుపై గోయల్, లోకసభ నుంచి ఎంపీ శివప్రసాద్ సస్పెన్షన్
Recommended Video
న్యూఢిల్లీ: పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం తమ నిరసనను కొనసాగించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఎంజీఆర్ వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని నినాదాలు చేశారు. విశాఖ రైల్వే జోన్ పైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికల ఖర్చుకు రూ.2000 కోట్లు కావాలట, జనసేన తొలి విజయం: పవన్, చిరంజీవి సీఎం అవుతారనే
తెలుగుదేశం పార్టీ ఎంపీల తీరుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టడాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. కానీ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అదే తీరుతో వ్యవహరిస్తున్నారన్నారు.
దుష్టకూటమికి చంద్రబాబు యోచన
ఆంధ్రప్రదేశ్లో దుష్టకూటమికి చంద్రబాబు యోచిస్తున్నారని పీయూష్ గోయల్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ మాదిరిగానే ఏపీ ప్రజలు కూడా టీడీపీ-కాంగ్రెస్ పార్టీ కూటమికి బుద్ధి చెబుతారన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడు అసెంబ్లీలో టీడీపీ నేతలు ప్రశంసిస్తూ తీర్మానం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ద్వారా ఎక్కువ లాభం వస్తుందని చెప్పారన్నారు.
ప్యాకేజీ ఇస్తామంటే ఆనందంగా ఆహ్వానించారు
కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా అంటూ మళ్లీ డ్రామాలు ఆడుతున్నారని పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడు ఆనందంగా ఆహ్వానించి, అంగీకరించి, ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏమిటన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు. ఏపీలో జరుగుతున్న అవినీతిని కప్పిపుచ్చేందుకే టీడీపీ ఆందోళన పేరిట ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు.
గోయల్ దెబ్బకు టీడీపీ నేతలు ఏం చెప్పారంటే
పీయూష్ గోయల్ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు జోక్యం చేసుకున్నారు. మీ మంత్రిత్వ శాఖ నుంచి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ప్యాకేజీపై కాకుండా రైల్వే జోన్ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా పైన యూటర్న్ తీసుకున్నారని గోయల్ విమర్శలు చేయగానే.. మీ శాఖ గురించి చెప్పాలని టీడీపీ నేతలు చెప్పడం గమనార్హం. రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు.
శివప్రసాద్ సహా నలుగురి సస్పెన్షన్
ఆ తర్వాత లోకసభలో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వీరికి జతగా కావేరీ నదీ జలాల వివాదంపై అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్, మరో ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్.. శివప్రసాద్తో పాటు కావేరీ నదీ జలాలపై ఆందోళన చేసిన ముగ్గురు అన్నాడీఎంకై ఎంపీలను సస్పెండ్ చేశారు. గత వారం స్పీకర్ మొత్తం 45 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. గత బుధవారం 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను, గురువారం 21 మంది అన్నాడీఎంకే, టీడీపీ ఎంపీలనుసస్పెండ్ చేశారు.