ఢిల్లీలో రఘురామ పలుకుబడి మామూలుగా లేదుగా: ఏకంగా లోక్సభ సెక్రెటేరియట్, కేంద్ర హోం శాఖ
అమరావతి: సొంత పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. హస్తినపై తనకు ఉన్న పట్టును, అక్కడున్న పలుకుబడిని మరోమారు చాటుకున్నారు. జగన్ ప్రభుత్వ పనితీరుపై అడుగడుగునా విమర్శనాస్త్రాలు, ఆరోపణలను సంధిస్తోన్న ఆయన.. తాజాగా చేసిన ఫిర్యాదుపై లోక్సభ స్పందించింది. రఘురామ చేసిన ఫిర్యాదుపై ఆరా తీయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనిపై ఓ వాస్తవ నివేదిక (ఫ్యాక్చువల్ నోట్) అందజేయాలంటూ సూచించింది. ఈ మేరకు లోక్సభ ప్రివిలేజెస్ అండ్ ఎథిక్స్ విభాగం ఉప కార్యదర్శి బాలగురు ఆదేశాలను జారీ చేశారు.
15 రోజుల్లో
దీనికి సంబంధించిన కాపీలను ఆయన హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యక్తిగత కార్యదర్శి సాకేత్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి అజయ్ భల్లాలకు పంపించారు. 15 రోెజుల్లోగా వాస్తవ నివేదికను అందజేయాంటూ సూచించారు. దీనికి అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు..రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్లను సంప్రదించే అవకాశాలు లేకపోలేదు. లోక్సభ సెక్రెటేరియట్ జారీ చేసిన ఆదేశాలను వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు అంశాలపై వివరణ కోరుతారని అంటున్నారు.
రఘురామపై ఎఫ్ఐఆర్
మతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ ప్రభుత్వంలోని కొందరు పెద్దలే తనపై కేసులు పెట్టించారని రఘురామ కృష్ణంరాజు ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. మతాల మధ్య చిచ్చు పెట్టేలా తాను వ్యవహరిస్తున్నానంటూ పలు సెక్షన్తో పాటు పోర్నోగ్రఫీ ప్రసారాలను నిరోధించడానికి ఐటీ చట్టంలో పొందుపరిచిన సెక్షన్ 67 ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదైందంటూ ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన ఈ నెల 1వ తేదీన ప్రివిలేజ్ మోషన్ను ప్రవేశ పెట్టారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి దాన్ని అందజేశారు. తనపై నమోదైన ఫిర్యాదుల గురించి వివరించారు.
ఫిర్యాదులపై స్పందించిన లోక్సభ
రఘురామ చేసిన ఫిర్యాదులపై లోక్సభ సెక్రెటేరియట్ స్పందించింది. ఆయన చేసిన ఫిర్యాదు కాపీలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించింది. ఆయన పొందుపరిచిన అంశాల గురించి ఆరా తీయాలని ఆదేశించింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని, దీనిపై ఓ నివేదికను అందజేయాలని సూచించింది. ఈ నివేదికను లోక్సభ స్పీకర్కు అందజేయాల్సి ఉన్నందున.. దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మోస్ట్ ఇమ్మీడియట్గా దీన్ని భావించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనిపై కేంద్ర హోం శాఖ అధికారులు తక్షణమే స్పందించే అవకాశాలు లేకపోలేదు. రఘురామ చేసిన ఫిర్యాదుల కాపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయడం ఖాయంగా కనిపిస్తోంది.
సజ్జల, గౌతమ్ సవాంగ్పై
తనపై తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు కావడానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రధాన కారకులంటూ అప్పట్లో రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. వారిద్దరిపై తాను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశానని చెప్పారు. లోక్సభ స్పీకర్ను కలిసి, తనపై నమోదైన కేసుల గురించి వివరించానని చెప్పారు. త్వరలోనే వారిద్దరినీ పిలిపిస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగానే లోక్సభ సెక్రెటేరియట్ స్పందించింది. వాస్తవ పరిస్థితులను ఆరా తీయాలంటూ కేంద్ర హోం శాఖను ఆదేశించింది.