స్పీకర్ ఓకే: 5గురు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం! బుట్టా రేణుక-కొత్తపల్లి గీతపై ఫిర్యాదు
Recommended Video
ఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు! ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ రాజీనామాలను ఆమోదించారని ఆయన వెల్లడించారు. అలాగే, పార్టీ మారిన మరో ముగ్గురు తమ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరినట్లు తెలిపారు.
మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు (బుధవారం) సాయంత్రం లేదా రేపు (గురువారం) ఉదయం వెలువడవచ్చునని తెలుస్తోంది. ఎంపీలు మాత్రం తమ రాజీనామాలు ఆమోదించినట్లు తెలిపారు.
తమ రాజీనామాలు ఆమోదించారని వైవీ సుబ్బారెడ్డి కూడా తెలిపారు. అలాగే, పార్టీ మారిన బుట్టా రేణుక, కొత్తపల్లి గీత, ఎస్వీ సుబ్బారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. మరోసారి రాజీనామా లేఖలు ఇవ్వాలని స్పీకర్ కోరారని చెప్పారు. రీకన్ఫర్మేషన్ లేఖలు ఇవ్వాలని కోరారని చెప్పారన్నారు.
మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పీకర్కు చెప్పామని, దీంతో ఆమె రీకన్ఫర్మేషన్ లేఖలు ఇస్తున్నామని, దీంతో వాటిని ఇస్తే రాజీనామా ఆమోదిస్తానని ఆమె చెప్పారని వైసీపీ ఎంపీలు చెప్పారు. రీకన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వగానే అధికారికంగా ప్రకటన వెలువడుతుందన్నారు. ఇక తాము ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తామని చెప్పారు.