Lok Satta: మా ఆలోచన, లక్ష్యం అదే: జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన జయప్రకాశ్: తొలిసారిగా..సానుకూలంగా!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల సానుకూల ప్రకటనలు వెలువడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ సహా ఒకరిద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సైతం వైఎస్ జగన్ నిర్ణయానికి అనుకూలంగా స్పందించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వంటి నాయకులు మూడు రాజధాని నగరాల నిర్ణయాన్ని స్వాగతించారు.
సీఎం జగన్ ను ఫాలో అయిన సీఎం కేసీఆర్: పెంచేశారుగా లిక్కర్ ధరలు
తప్పు పట్టలేని ప్రకటన..
తాజాగా అదే జాబితాలో లోక్ సత్తా అధినేత, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ సైతం చేరిపోయారు. రాష్ట్రానికి మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేయాలంటూ వైఎస్ జగన్ చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఆయన వెల్లడించారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఓ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. అధికారాన్ని వికేంద్రీకరించాలనే నిర్ణయాన్ని తప్పు పట్టలేమని ఆయన వ్యాఖ్యానించారు.
లోక్ సత్తా ముఖ్య ఉద్దేశం అదే..
అధికార వికేంద్రీకరణ జరగాలనే విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తున్నామని అన్నారు. ఒకే చోట, ఒకే ప్రాంతంలో అధికారాన్ని గానీ, అభివృద్ధిని గానీ కుప్పగా పోయడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు రావని చెప్పారు. అధికార వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా జరిగి తీరాల్సిన అవసరం ఏ రాష్ట్రానికైనా అవసరం అవుతుందని అన్నారు. లోక్ సత్తా ప్రధాన లక్ష్యం, ముఖ్య ఉద్దేశం అదేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
సమంగా అభివృద్ధి..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాడానికి అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే సాధ్యమని జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అలాంటి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమని చెప్పారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని, వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు పురోగమించవని అన్నారు.
కేంద్రబిందువుగా అమరావతి..
అమరావతిని కేంద్ర బిందువుగా చేసుకుని..మూడు రాజధానుల పరిపాలనా వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. ఈ నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వంపై ఉందని అన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని తీసుకున్నట్లే అమలు చేయాలని, ఇందులో ఎలాంటి అవకతవకలకు చోటు కల్పించకూడదని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.