పవన్ కళ్యాణ్ దూకుడు: చిరు ఫ్యాన్స్ తర్వాత, జనసేనలోకి లోక్సత్తా నేతలు
అమరావతి: లోక్సత్తా పార్టీ నాయకులు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆదివారం నాడు లోక్సత్తా నేత కటారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో తుదివిడత చర్చలు జరగనున్నాయని తెలుస్తోంది. ఎక్కువ మంది నాయకులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
Recommended Video
జనసేన కీలక నిర్ణయం, వచ్చే ఎన్నికల్లో పొత్తు: త్వరలో ఉమ్మడి అజెండా
2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించారు. ఓ వైపు ప్రజల్లోకి వెళ్తూ, మరోవైపు పార్టీ నిర్మాణం కోసం పని చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన పలుమార్లు పార్టీ నేతలతో భేటీ అవుతు సూచనలు చేస్తున్నారు. ఇటీవల జనసేన వీరమహిళ విభాగంతోను భేటీ అయ్యారు.
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పార్టీపై దృష్టి
ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఈ సమయంలో ఆయన అందివచ్చిన ప్రతి అంశంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే పార్టీలోకి ఎవరిని పడితే వారిని కాకుండా చిత్తశుద్ధితో, ప్రజల కోసం పని చేసే వారిని మాత్రమే తీసుకుంటానని ఆయన పదేపదే చెబుతున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఆయన పిలిస్తే ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన రాజకీయాల కోసం వచ్చే నేతల కోసం వేచి చూడటం లేదని అంటున్నారు.
పార్టీ నిర్మాణంపై జనసేనాని దూకుడు
తాను ఇరవై అయిదేళ్ల పాటు రాజకీయాల్లో ఉండేందుకు వచ్చానని, ప్రజలు తనకు ఓటు వేసినా, వేయకున్నా వారి కోసం పోరాటం మాత్రం చేస్తానని జనసేనాని చెబుతున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారం చేపట్టడం ఖాయమని తన బహిరంగ సభల్లో చెబుతున్నారు. పార్టీ నిర్మాణం కోసం పవన్ వేగంగా పని చేస్తున్నారు.
చిరంజీవి అభిమానుల తర్వాత లోక్సత్తా
ఇప్పటికే పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు జనసేనలో చేరారు. యువతపై దృష్టి సారించారు. లెఫ్ట్ పార్టీతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే, లోక్సత్తా పార్టీ రాజకీయాల్లో విఫలమైనప్పటికీ ఆ పార్టీకి, పార్టీ నేతలకు మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో వారిని చేర్చుకునే విషయమై రెండు పార్టీల మధ్య గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఆదివారం తుది చర్చలు జరగనున్నాయి.
ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే ఛాన్స్
చిరంజీవి అభిమానులు, లోక్సత్తా పార్టీ నేతలతో పాటు ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ వెంట అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు వివిధ పార్టీల్లో ఉన్నారు. గంటా శ్రీనివాస రావు జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా, ఆయన వైఖరి చూస్తుంటే అలా కనిపించడం లేదు. అయితే, ఎన్నికలు మరింత సమీపించాక.. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారు తమ వైపు చూస్తే.. పవన్ వారిలో కొందరిని జనసేనలోకి ఆహ్వానించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.