‘జగన్! హర్షకుమార్కు వేధింపులు అందుకేనా?: మెడలు వంచుతా అన్నావు ఏమైంది?’
అమరావతి: గోదావరి బోటు ప్రమాదం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టినందుకే దళిత నాయకుడు, మాజీ ఎంపీ హర్షకుమార్ను కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. అంతేగా, ఇది మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
చేతకాని దద్దమ్మ..
గోదావరిలో 144 సెక్షన్ పెట్టారు కానీ.. బోటును మాత్రం తీయలేరా? అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా? అని లోకేష్ ప్రశ్నించారు.
ఆ వ్యక్తి ఎవరు?
బోటు ప్రమాదం వెనుక ఉన్న రహస్యాన్ని జలసమాధి చేయాలని చూసినంత మాత్రాన నిజాలు దాగవని ఈ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ఘటన జరిగి రోజు విధుల్లో ఉన్న ఎస్సైకి ఫోన్ చేసి ఆపేసిన బోటును వదిలేయాలంటే ఒత్తిడి చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు. బోటు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మెడలు వంచుతా అన్నావు.. ఏమైంది?
ఇది ఇలా ఉంటే, మరో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 25 ఎంపీలు ఇస్తే.. కేంద్రం మెడలు వంచైనా హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఆ విషయమే ప్రస్తావించడం లేదని మండిపడ్డారు.
బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందని, వాళ్లు మన మాట వినే పరిస్థితిలో లేరని జగన్ చెప్పడం.. అతని చేతకాని తనానికి నిదర్శనమని ఆనంద్ బాబు విమర్శించారు.
ప్రధానితో భేటీపై మౌనం ఎందుకు?
నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రధానితో భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం మీడియాతో మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నించారు. మోడీతో ఏ విషయాలు చర్చించారు.. ఆయన స్పందన ఏంటీ అనే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుకు నిధులు కోరడమేంటని ప్రశ్నించారు. అసలు ప్రధానితో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించేందుకే వెళ్లారా? లేక కేసుల మాఫీ కోసం వెళ్లారా? అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.