ప్రొద్దుటూరులో లోకేష్ , చంద్రబాబు పరామర్శ : హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబానికి భరోసా
ప్రొద్దుటూరులో టిడిపి నేత సుబ్బయ్య దారుణ హత్యకు గురి కావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రొద్దుటూరు వెళ్లి మృతుడు సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు .టీడీపీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు . సుబ్బయ్య భార్య అపరాజితను పరామర్శించి ధైర్యం చెప్పారు లోకేష్ .
జగన్ రెడ్డీ... ప్రశాంతంగా ఉన్న సీమలో రక్తం పారిస్తున్నావ్, ఈ పాపం వూరికే పోదు : లోకేష్ ధ్వజం
సుబ్బయ్య ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చిన లోకేష్
సుబ్బయ్య భార్య అపరాజితతో మాట్లాడిన లోకేష్ హత్యకు గల కారణాలను , కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . సుబ్బయ్య ఇద్దరు పిల్లల చదువు బాధ్యతను తామే తీసుకుంటామని లోకేష్ ఆమెకు హామీ ఇచ్చారు . ప్రొద్దుటూరులో పట్టపగలు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్ద అందరూ చూస్తుండగా దుండగులు టీడీపీ నేత సుబ్బయ్యను దారుణంగా హతమార్చటంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుబ్బయ్య మృతదేహం వద్ద ఆందోళన కు దిగారు .
సుబ్బయ్య మృతదేహం వద్ద లోకేష్ ఆందోళన .. వారిపై ఎఫ్ఐఆర్ కు డిమాండ్
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేయించారని లోకేష్ ఆరోపణలు గుప్పించారు. హత్య చేసిన ఎమ్మెల్యే , అతని బావమరిది బంగారు రెడ్డి పై , అలాగే మున్సిపల్ కమీషనర్ రాధపై ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు .రాష్ట్రంలో హత్యా రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్న లోకేష్ సీమలో నెత్తురు పారిస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు . హత్య భావించబడిన టీడీపీ నేత సుబ్బయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు .
మృతుడి భార్యతో మాట్లాడిన చంద్రబాబు .. ధైర్యం చెప్పిన టీడీపీ అధినేత
హతుడి భార్య అపరాజిత తో మాట్లాడిన చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు. మీకు మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నిందితులు వదిలే ప్రసక్తే లేదని, న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం సాగిస్తుందని చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు తో మాట్లాడిన అపరాజిత తన భర్తను హత్య చేసి తనకు తీవ్ర అన్యాయం చేశారని తన పిల్లలిద్దరూ చిన్నపిల్లలని కన్నీరుమున్నీరైంది. చంద్రబాబు ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పగా , టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా ప్రొద్దుటూరు కి వెళ్ళి మృతుడు సుబ్బయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు.