సింగపూర్ లో లోకేష్ బిజీ బిజీ..! పలు పారిశ్రామిక వేత్తలను సంప్రదిస్తున్న యువనేత..!!
హైదరాబాద్ : ఏపిలో పెట్టబడులే లక్ష్యంగా ఏపి ఐటీ శాఖా మంత్రి లోకేష్ విదేశీ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్ టూర్ లో ఉన్న లోకేష్కు ఎన్నారైలు ఘన స్వాగతం పలకగా వారితో కాసేపు మాట్లాడారు. ఏపీ చాలా వేగంగా ఎదుగుతున్న రాష్ట్రమని, పెట్టుబడులకు అత్యంత అనుకూలమైనదని వారితో వివరిస్తూ ఏపీలో అభివృద్ధి కి ఎన్ఆర్ఐలు అంబాసిడర్లుగా మారి ప్రచారం చేయాలని వారిని లోకేష్ కోరారు. పెట్టబడులే లక్ష్యంగా సిగపూర్ లో పర్యటిస్తున్న లోకేష్ పలు పారిశ్రామిక వేత్తలనే కాకుండా ఐటీ దిగ్గజాలను కలుస్తున్నారు. సన్ రైసింగ్ సిటీ గా అవతరిస్తున్న అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని లోకేష్ వారికి పిలునిచ్చారు.
పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ విదేశీ పర్యటన..! సింగపూర్ లో పలు పారిశ్రామిక వేత్తలతో భేటీ..!!
ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఏపీలో పెట్టుబడులను మరింత పెంచడం, పరిపాలనకు మరింత సాంకేతికతను జోడించడం, అమరావతి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సింగపూర్ గవర్నమెంట్తో సత్సంబంధాలు కొనసాగించడం ప్రధానాంశాలుగా లోకేష్ సింగపూర్ పర్యటన జరుగుతోంది. ఈరోజు పలువురు ప్రముఖులను లోకేష్ కలిశారు. వారిలో ముఖ్యమైన వ్యక్తి భారత సంతతికి చెందిన గోపీనాథ్ పిళ్లై కూడా ఉన్నారు. ఆయన సింగపూర్ ప్రభుత్వానికి అంబాసిడర్. పద్మ శ్రీ అవార్డు గ్రహీత కూడా.
అమరావతికి రండి..! పెట్టుబడులకు అనువైన ప్రదేశం..! సింగపూర్ లో లోకేష్ పిలుపు..!!
కొత్త రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా పూర్తవడానికి అవసరమైన సాంకేతికతను, సహాయాన్ని అందించడంలో మరింతగా సహకరించాలని ఆయనను కోరినట్టు లోకేష్ తన ట్విట్టరు ద్వారా తెలిపారు. దీంతో పాటు మరిన్ని విషయాలపై లోకేష్ ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఏపీలో యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, ఐటీ, ఐటీ యేతర కంపెనీల స్థాపనకు ముఖ్యంగా స్టార్టప్ కంపెనీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను గోపీనాథ్కు వివరించినట్లు లోకేష్ తెలిపారు.ఈ సందర్భంగా స్టార్టప్ కంపెనీల అభివృద్ధిలో ఏపీలో నెంబర్ 1 స్థానానికి ఎలా చేరిందో ఆయనకు వివరించారు.
పెట్టుబడి దారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..! పరిశ్రమలు నెలకొల్పాలని విజ్ఞప్తి..!!
తయారీ, లాజిస్టిక్స్, ఏరో స్పేస్, నిర్మాణ రంగాల్లో ఏపీ అభివృద్ధి సాధించడం ద్వారా రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పరోక్షంగా ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది. అందుకే ఆయా రంగాల్లో మోడల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిపై కూడా లోకేష్ గోపీనాథ్ పిళ్లైకి వివరించినట్లు ఆయన స్వయంగా తెలిపారు. అనంతరం క్యాపిటల్ రీజియన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ, ఇన్నోవేషన్ కారిడార్ ఏర్పాటుకి సహకారం అందించాలని గోపీనాథ్ ని కోరగా ఆయన ఈ వినతి పట్ల సానుకూలంగా స్పందించినట్టు లోకేష్ తెలిపారు.
ఎన్నారై సమస్యలు పరిష్కరింస్తాం..! ముందు ఏపి లో పెట్టుబడుల గురించి స్పందించాలంటున్న లోకేష్.!
అంతే కాకుండా ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులతో ఏర్పాటైన సమావేశంలో లోకేష్ ప్రసంగించారు. ఎన్ఆర్ఐ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎన్ఆర్టీ ఏర్పాటు చేశామని, తెలుగు ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన లోకేష్ ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారం కోసం ఏ రాష్ట్రమూ ఏర్పాటుచేయని విధంగా ప్రత్యేక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.