దమ్ముంటే అది నిరూపించండి: లోకేష్, 'రఘువీరా వేస్ట్ ఫెలో, జగన్ ఉనికి కోసమే యువభేరి'
దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని మంత్రి లోకేష్ ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
విశాఖ: రెండు నెలల క్రితం వరకు విశాఖ భూకుంభకోణాలపై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ జరిగింది. అధికార పార్టీలోని మంత్రుల మధ్యే దీనిపై బేధాభిప్రాయాలు రావడం కూడా పలు అనుమానాలకు తావిచ్చింది. కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్రపై ఆరోపణలు వచ్చాయి.
మరో మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు కూడా దానికి ఊతమిచ్చాయి. మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే కుంభకోణం జరిగిందంటూ ప్రతిపక్షాలు కూడా ప్రచారం చేశాయి. గత కొద్దిరోజులుగా తెరమరుగైన ఆ అంశంపై లోకేష్ స్పందించారు. విశాఖ పర్యటన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దమ్ముంటే నిరూపించండి:
విశాఖ భూ కుంభకోణాల్లో తనపై ఆరోపణలు చేసినవారు, సిట్కు మాత్రం ఎందుకు ఆధారాలు సమర్పించలేదని ప్రశ్నించారు. ప్రతిపక్షం ప్రతిసారి ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ము ఉంటే ఆధారాలతో నిరూపించాలని మంత్రి లోకేష్ ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
నిధులను అడ్డుకుంటున్నారు:
నరేగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ వైసీపీ ఎంపీలు ప్రధాని మోదీకి లేఖలు ఇచ్చి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ది పనులకు ఆ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతోందని అన్నారు.
రఘువీరా వేస్ట్ ఫెలో: బుద్దా వెంకన్న
సొంత నియోజక వర్గంలో డిపాజిట్ దక్కించుకోలేని రఘువీరా రెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్టుచేటని అన్నారు. రఘువీరారెడ్డి వేస్ట్ ఫెలో కాబట్టే కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
జగన్ ఉనికి కోసమే యువభేరి:
సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలకు దిగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.
ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికే యువభేరి కార్యక్రమం చేపట్టారని బుద్ధా విమర్శించారు.