మీడియా ముందే తేల్చుకుందాం...రండి:విపక్షాలకు లోకేష్ సవాల్
విజయవాడ:తమపై విపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై మీడియా ఎదుట చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేకహోదా ఇవ్వని ప్రధాని మోడీని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత, జగన్ ఎందుకు విమర్శించడంలేదని లోకేష్ ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాసం పెడతామని లోకేష్ తెలిపారు. వైసీపీ ఎంపీలు పోరాడకుండా రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. అమరావతి అంతర్జాతీయ క్రియేటివిటీ సెంటర్గా ఎదగాలని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. సోమవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆరో డివిజన్లో గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం 150 రోజుల పాటు కొనసాగుతుందన్నారు.
చంద్రబాబు పాలనపై 90 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమని బుద్దావెంకన్న గ్రామదర్శిని కార్యక్రమం గురించి చెప్పుకొచ్చారు.