ప్రశ్నిస్తే చంపేసే నయా నియంత జగన్ రెడ్డి : జనసేన కార్యకర్త వెంగయ్య మృతిపై లోకేష్ వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ప్రశ్నిస్తే చంపేసే నియంత జగన్ మోహన్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర పల్లి గ్రామంలో అభివృద్ధి పనులు చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ను ప్రశ్నించిన వెంగయ్య అనే వ్యక్తిని చంపేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.
Recommended Video
25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు ఆటో డ్రైవర్ ను చంపేశారు
ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన నారా లోకేష్ ప్రశ్నిస్తే చంపేస్తాడు నయా నియంత వైయస్ జగన్ అంటూ వ్యాఖ్యానించారు. 25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ప్రతాప్ ని చంపేశారని ఆరోపించారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర పల్లి గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదని ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు వెంగయ్యను చంపేశారు. ఈ హత్యలు అన్ని ప్రభుత్వ హత్యలే అంటూ ఆరోపించారు.
వైసీపీ చెత్త పాలన ప్రశ్నిస్తే చంపి ఆత్మహత్య అని కేసులు క్లోజ్
అంతేకాదు వైసిపి ప్రభుత్వ చెత్త పాలనను ప్రశ్నించిన వారిని చంపి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కేసు క్లోజ్ చేయడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. వైసిపి రౌడీ మూకలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
వెంగయ్య టీడీపీ కార్యకర్త కానప్పటికీ లోకేష్ వెంగయ్య మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేసి వైసీపీ సర్కార్ తీరును తప్పుపట్టారు .
జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్య .. పవన్ ఫైర్ , లోకేష్ సైతం ఆగ్రహం
ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త వెంగయ్య ఆత్మహత్య చేసుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన కార్యకర్త వెంగయ్య నియోజకవర్గ సమస్యలపై, అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే ని నిలదీశారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ను ప్రశ్నించినందుకు వెంగయ్య ప్రాణాలు తీసుకునే పరిస్థితి రావడం దారుణమని అటు జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. వెంగయ్య పై గిద్దలూరు ఎమ్మెల్యే తీసుకు వచ్చిన ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గిద్దలూరు ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వెంగయ్య మృతిపై లోకేష్ సైతం జగన్ ను టార్గెట్ చేసి మండిపడ్డారు .