ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి దొంగ అబ్బాయికి ఏం తెలుస్తుంది: లోకేశ్ ట్వీట్
అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలను మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ లోకేష్ ట్వీట్ల ద్వారా కౌంటర్ ఇచ్చారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి నెం.1 ర్యాంక్ రావడం గురించి జగన్ చేసిన ఆరోపణలపై స్పందించిన మంత్రి లోకేష్...ఈజ్ ఆఫ్ డూయింగ్ గురించి దొంగ అబ్బాయిని అడిగితే ఏం తెలుస్తుంది? అని ఎద్దేవా చేశారు. అదే క్విడ్ ప్రోకో విధానంలో అవినీతి, అక్రమ సంపాదన గురించి అడిగితే...జగన్ సమాధానం చెబుతారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఎలా ఉందని జగన్ ప్రశ్నించడంలో గాని, లేదా అవినీతిలో జగన్ నంబర్ వన్ ఎలా అయ్యాడో సిబిఐ ప్రశ్నించడంలో గాని ఏమీ ఆశ్చర్యం లేదని లోకేష్ పేర్కొన్నారు.
How can we expect Dongabbai to know about getting a rank in #EoDB. Ask him about corruption or deal-making in the backend, he will know. No wonder he has questions about AP’s No 1 rank and CBI has questions about his No 1 rank in corruption. #CorruptionKingJagan
— Lokesh Nara (@naralokesh) July 19, 2018
నిన్న కాకినాడ బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో ఉండేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు...ఈజ్ ఆఫ్ డూయింగ్ కరప్షన్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిపాలనలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని గత రెండేళ్లలో మూడు ప్రఖ్యాత సంస్థలు...నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తేల్చి చెప్పాయన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానం ఇచ్చిన వారికి బుద్ధి, జ్ఞానం ఉందా?'...అని జగన్ మండిపడ్డారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను తిప్పికొడుతూ లోకేశ్ ట్విట్టర్లో బదులిచ్చారు.