టీడీపీ దెబ్బ తింది లోకేష్ వల్లే .. వైఎస్ జగన్ ను అనే అర్హత లోకేష్ కు లేదు : మంత్రి అవంతి ఫైర్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిన మాజీ మంత్రి లోకేష్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.లోకేష్ వల్లే తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిందని ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు లోకేశ్ నాయకత్వం ఒప్పుకోలేరని, అసలు లోకేష్ ది జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని నిప్పులు చెరుగుతున్నారు.
జగన్ పాలన విధ్వంసకర పాలన అన్న లోకేష్ పై వైసీపీ నేతల ఆగ్రహం
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు. సీఎం జగన్ రాష్ట్ర పరువును దిగజార్చారని, జగన్ పాలన విధ్వంసకర పాలన అంటూ ఆయన మండిపడ్డారు.ఇక తన ట్వీట్లకే వణుకు పుడుతుంటే తాను ఫీల్డ్ మీదకు వెళితే ఎలా ఉంటుందో అని ఆయన పేర్కొన్నారు.అంతేకాదు రాష్ట్రంలో పాలనపై ఎక్కడైనా చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని ప్లేస్, టైమ్ చెప్పు జగన్ రెడ్డి అంటూ లోకేష్ సవాల్ విసిరారు.ఇక వైసీపీ నేతలు లోకేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు .
ఒర్వలేకనే ప్రభుత్వంపై బురద
లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి అవంతి శ్రీనివాస్ సమాధానమిచ్చారు.జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు అని పేర్కొన్న మంత్రి అవంతి శ్రీనివాస్ భారతదేశంలోని ముఖ్యమంత్రుల పనితీరులో టాప్ ఫైవ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు గుర్తు చేశారు. అలాంటి సీఎం జగన్ ను విమర్శించడం కేవలం జగన్ పాలన తట్టుకోలేకే అని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ కు సీఎం ను విమర్శించే అర్హత లేదు
ఇక చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన లోకేష్ కు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదని నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లుగా చంద్రబాబు నాయుడుని భ్రష్టు పట్టించింది లోకేష్ కాదా అంటూ ప్రశ్నించారు అవంతి. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్ లోకేష్ నేనని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తుంది లోకేష్ అని ఆయన మండిపడ్డారు.రాష్ట్రంలో కుల జాడ్యం ఇంతగా పెరగడానికి లోకేష్ కారణం కాదా అంటూ ప్రశ్నించారు.
లోకేష్ వల్లే టీడీపీ ఘోరంగా దెబ్బ తింది
ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా లోకేష్ నాయకత్వాన్ని ఒప్పుకుంటారా చెప్పండి అంటూ నిలదీశారు మంత్రి అవంతి శ్రీనివాస్. లోకేష్ పార్టీలో బాధ్యతలు తీసుకున్న తర్వాతే తెలుగుదేశం పార్టీ భయంకరంగా దెబ్బతిందని పేర్కొన్నారు. ఇక అంతేకాదు గతంలో టిడిపి రాష్ట్రంలో ప్రజలసంక్షేమాన్ని గాలికి వదిలేసిందని రైతుల కష్టాలను పట్టించుకోలేదని,ప్రజల ఆరోగ్యాన్ని కూడా గాలికి వదిలేసిందని ఆరోపణలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు, లోకేష్ లు ట్విట్టర్,జూమ్ లకే పరిమితమయ్యారు
ఇక సంక్షేమపథకాల విషయంలో నేరుగా ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని,దురుద్దేశంతో లోకేష్ చంద్రబాబులు చేసే విమర్శలు పట్టించుకోవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక చంద్రబాబు, లోకేష్ లు ట్విట్టర్,జూమ్ లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకునేది లేదని, ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి ఆ ప్రాంతాల వాసులు కష్టంలో ఉంటే కనీసం పరామర్శకు కూడా తండ్రి కొడుకులు రాలేదని విమర్శించారు.
పార్టీ అధ్యక్ష పదవి నుండి కళావెంకట్రావుని తొలగించాలని లోకేష్ కుట్రలు
ఓడిపోయారు అన్న కారణంతో పార్టీ అధ్యక్ష పదవి నుండి కళావెంకట్రావుని తొలగించాలని లోకేష్ కుట్రలు చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. లోకేష్ ఆరోపణలు, చేస్తున్న వ్యాఖ్యలు కేవలం బురద చల్లటం తప్ప మరి ఇంకేం కాదని తెలుగు రాష్ట్రాల ప్రజలు వారి వ్యాఖ్యలు పట్టించుకోరని తేల్చి చెప్పారు. ఎన్నికల హామీల్లో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం జగన్ ది అని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు .