'విత్తనాలో జగన్ ప్రభో' అంటే చంద్రబాబు చేశారంటారు ..అధికారం వెలగబెడుతుంది మీరేగా ? లోకేష్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్తనాల సంక్షోభానికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడే కారణమని వైసీపీ మాటల దాడి చేస్తుంది . అంతే కాదు వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి కూడా లోకేష్ , చంద్రబాబులే విత్తనాల కొరతకు కారణం అని మండిపడుతున్నారు. ఇక రాష్ట్రంలో రైతులు విత్తనాల కొరతతో ఇబ్బంది పడుతుంటే అందుకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్తున్న వైసీపీ నేతలపై ఎదురు దాడికి దిగారు మాజీ మంత్రి లోకేష్ .
‘విత్తనాలో జగన్ ప్రభో' అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే మా మీద విమర్శలు చేస్తారని ఫైర్ అయిన లోకేష్
ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. నిన్నటికి నిన్న రాష్ట్రంలో రైతులకు విత్తనాలే ఇవ్వలేని ప్రభుత్వం ఇక నీళ్ళు ఇస్తుందంటా అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉందని మరిచిపోయారా? అని ప్రశ్నించారు. ‘విత్తనాలో జగన్ ప్రభో' అంటూ రైతులు గగ్గోలు పెడుతుంటే అది పట్టించుకోకుండా , గత పాలకుడు చంద్రబాబు వల్లే రైతులకు విత్తనాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పటం సిగ్గు చేటని లోకేష్ విమర్శించారు. ఒకటో తారీకున వచ్చే పింఛన్ రాలేదేమని వృద్ధులు నిలదీస్తుంటే గత ప్రభుత్వం వల్లే ఆలస్యమైందని సమాధానం ఇవ్వడం కరెక్టు కాదని అన్నారు. మీ అసమర్ధత బయటకు తెలుస్తున్నా గత పాలకుల వల్లే చెయ్యలేకపోతున్నామని చెప్పటం దారుణం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీలో అధికారం వెలగబెడుతోంది వైసీపీనా? టీడీపీనా? అని ప్రశ్నించిన లోకేష్
ఇక వైసీపీ పాలనలో ‘భీమా రాలేదు .... మా బతుకులకు ధీమా ఏదీ అంటే తెలుగుదేశం సర్కారు వల్లే' అంటూ మాట దాటవేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. నేను విన్నాను, నేను ఉన్నానంటూ.. ప్రజలను నమ్మించి సీఎం అయి , పాలన చేతకాక, ఇప్పుడు చంద్రబాబే వింటాడు, చంద్రబాబే ఉంటాడు అని అంటున్నారని ఎద్దేవా చేశారు . ఏపీలో అధికారం వెలగబెడుతోంది వైసీపీనా? టీడీపీనా? అని మాజీ మంత్రి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాజకీయ వేడిని పుట్టిస్తున్న విత్తనాల కొరత రగడ.. సర్కార్ సాయం కోసం ఎదురు చూస్తున్న రైతులు
జనవరి నుంచి విత్తనాల సేకరణకు నిధులు అడిగినా ఇవ్వలేదని, చంద్రబాబుకు 28 సార్లు అధికారులు లేఖలు రాసినా పట్టించుకోలేదని వైసీపీ ఆరోపిస్తుంది . ఇక వ్యవసాయ శాఖాధికారులు రాసిన లేఖలను టీడీపీ ఆఫీసుకు పంపిస్తామని సమాధానం చెప్పండని వైసీపీ నిలదీస్తుంది . ఇక తక్షణ చర్యగా రైతులకు విత్తనాలు అందించాలని, రైతుల బకాయిలు చెల్లించాలని మరోపక్క ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా తన డిమాండ్ ను వినిపించారు. ఇక ఈ విత్తనాల రగడ చిలికి చిలికి ఒకరి మీద ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వేడి పుట్టిస్తుంది. కానీ సమస్య పరిష్కారం కోసం రైతులకు విత్తనాలు అందించటం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో అని రైతన్నలు ఎదురు చూస్తున్నారు.