అప్పుడు జగన్ గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారేమో..! ఏపి సీఎం పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. ఏపి మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో జగన్ పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్ వ్యాఖ్యలపై ట్విట్టర్లో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కాళేశ్వరం కడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా అంటూ..
సీఎం జగన్ గారు సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. కాళేశ్వరంపై చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. ఇలాంటివి చూసే సమయం మీకు ఉండి ఉండదు. ఎందు కంటే.. ఆ టైంలో తమరు గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారేమో' అని లోకేష్ ట్వీట్టర్లో ఎద్దేవాచేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆల్మట్టి, కాళేశ్వరం కట్టారని, కాళేశ్వరం కడుతుంటే.. ఆయన గాడిదలు కాశారా అని జగన్ అసెంబ్లీలో ప్రశ్నించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆల్మట్టి ఎత్తు పెంచారని, చంద్రబాబు చక్రం తిప్పుతున్న రోజుల్లోనే ఇవన్నీ జరిగాయని గుర్తుచేశారు.
తాను కాళేశ్వరం ప్రారంభానికి వెళ్లినా..వెళ్లకున్నా స్విచ్చాన్ చేసేవారని, సీఎం చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ పట్ల ఔదార్యం చూపుతున్నారని తెలిపారు. సత్సంబంధాలు కొనసాగిస్తున్నందుకు సంతోషించాల్సింది పోయి విమర్శిస్తారా అని మరోసారి ఆయన ప్రశ్నించారు. తెలంగాణతో స్నేహభావంతో మెలగడం తప్పా అని ప్రతిపక్షాన్ని నిలదీశారు. సీఎంల మధ్య సఖ్యత ఉండాల్సిన అవసరం ఉందని, తెలంగాణ నుంచి ఏపీకి గోదావరి నీరు ఇస్తున్నారని, నీళ్ల విషయంలోనూ రాజకీయాలు వెదుకుతున్నారని విమర్శించారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండదని జగన్ అన్నారు.