అందరికీ ఉద్యోగాలు: 13 ఐటీ కంపెనీలను ప్రారంభించిన నారా లోకేష్
విశాఖపట్నం: ఏపీకి వస్తున్న ఐటీ కంపెనీల్లో 60 శాతం విశాఖపట్టణంలోనే ఏర్పాటు చేస్తామని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతేగాక, 2024 నాటికి రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
Recommended Video
విశాఖలో నూతనంగా ఏర్పాటుచేసిన 13 ఐటీ కంపెనీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అలాగే మరో నాలుగు కంపెనీల విస్తరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
2లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. నిరుద్యోగ యువతకు నూటికి నూరు శాతం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
13 కంపెనీలు ప్రారంభం
విశాఖపట్నంలో బిజినెస్ ప్రోసెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న సీఈఎస్ లిమిటెడ్, వీఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ సెక్టార్కు గ్లోబల్ డిజైన్ సర్వీసెస్ అందిస్తున్న సెరియం సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, ఐఓటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వీసెస్ అందిస్తున్న సహస్రమయ టెక్నాలజీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తున్న వెలాంటా కేపీఓ అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్ధలు నూతన కంపెనీలను ప్రారంభించాయి.
లోకేష్ ధన్యవాదాలు
ఆఫ్షోర్ డెవలప్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న సింబయోసిస్, ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్,టెలికాం ఎక్సపెన్స్ మ్యానేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్న ఇన్స్ పైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్, కాన్డ్యూయెంట్ బీపీఓ సర్వీసెస్ అందిస్తున్న పాత్రా ఇండియా బీసీఓ సర్వీసెస్ వంటి కంపెనీలు విశాఖలో వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. వారందరికీ ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి లోకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
2024నాటికి నిరుద్యోగులు ఉండరు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 వేల ఐటీ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. 2024 నాటికి ఏపీలో నిరుద్యోగులు ఉండరని ఆయన అన్నారు. 2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.