వల్లభనేని వంశీని టీడీపీలో అవమానించెందెవరు: వైసీపీలోకి రావటం ఖాయమే..అయినా: అసలు విషయం ఏంటంటే..!
టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం పైన అటు టీడీపీలోనే కాదు..ఇటు వైసీపీలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వంశీ టీడీపీలో ఉండరని...వైసీపీలోకి ఖాయంగా వస్తారని వైసీపీ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. వంశీ టీడీపీలో ఉండలేని పరిస్థితి ఆ పార్టీ నేతలే తీసుకొచ్చారని కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. ఆయన అక్కడ ఉండలేకనే నేరుగా వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారని..ఎప్పుడు పార్టీలో చేరుతారనేది ఆయనే నిర్ణయిస్తారని చెబుతున్నారు.
ఇదే సమయంలో అసలు వంశీ టీడీపీ వీడటం వెనుక కేసులు..వ్యవహారాలు కాదని..అసలు విషయం టీడీపీలో ఉందన్నది వైసీపీ నేతలు వాదన. అక్కడ చినబాబు వంశీని అవమానించే విధంగా మాట్లాడారని..అది జీర్ణించుకోలేకనే వంశీ పార్టీ వీడుతున్నారనేది వైసీపీ నేతల వాదన. అయితే, వంశీ టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావటం లేదు. అదే సమయంలో వైసీపీలో చేరటం ఖాయమని చెబుతున్న ఆయన అనుచరులు..త్వరలోనే ముహూర్తం అంటున్నారు.
వంశీ టీడీపీ వీడే ముందు...
వల్లభనేని వంశీ మీద హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్ లో ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు ఫోర్జరీ కేసు నమోదు చేసారు. వంశీతో పాటుగా ఆయన అనుచరుల మీద కేసు నమోదైంది. ఆ తరువాత కొద్ది రోజులకు వంశీ గుంటూరు వచ్చిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని కలిసారు. ఆ వెంటనే మధ్నాహ్నం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో కొడాలి నాని.. పేర్ని నాని సైతం అక్కడే ఉన్నారు. దీని ద్వారా వంశీ ఇక వైసీపీలో చేరుతారని ప్రచారం సాగింది.
వాట్సప్ లేఖల ద్వారా
ఆ తరువాత వంశీ వాట్సప్ లేఖల ద్వారా టీడీపీ వీడుతున్నట్లు..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఇచ్చారు. చంద్రబాబు ఆ వెంటనే వంశీని వారించే ప్రయత్నం చేసారు. వెంటనే వంశీతో చర్చల కోసం ఇద్దరు నేతలను రంగంలోకి దించారు. అయినా వంశీ మొత్తబడలేదు. ఇదే సమయంలో అసలు జగన్ ను కలవటానికి ముందే వంశీ టీడీపీ అగ్ర నేతలను కలిసారు. వారికి తన సమస్యలను..ఇబ్బందులను వివరించారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలే వంశీ మనస్థాపానికి కారణంగా చెబుతున్నారు.
వంశీని హర్ట్ చేసిందెవరు...
వంశీ తన మీద కేసులు నమోదు అయిన తరువాత పార్టీ అధినేత చంద్రబాబును కలిసి తన సమస్యలు చెప్పుకోగా..ఆయన ధైర్యం చెబుతూ..అధికారం కోల్పోయిన సమయంలో బలమైన నాయకుల మీద ఇలాగే వ్యవహరిస్తారని..దైర్యంగా ఎదుర్కోవాలని సూచించినట్లు సమాచారం. ఆ తరువాత వంశీ పార్టీ నేత లోకేశ్ తో కూడా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఆ సమయంలో వంశీ తన సమస్యలను చెప్పుకోగా..లోకేశ్ స్పందించిన తీరుతో వంశీ బాధపడ్డారని..ఆయన సన్నిహితులతో చెప్పుకొని మధన పడ్డారని చెబుతున్నారు.
మాజీ మంత్రి అఖిల మీద కేసులు
పార్టీలో నీకు ఒక్కడికే కాదు సమస్యలు.. నీకన్నా చిన్నదైన మాజీ మంత్రి అఖిల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు...ధైర్యంగా ఎదుర్కోటోంది కదా..సీనియర్ అయిఉండి..ఇలా చేస్తే ఎలా అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలతో వంశీ తన మనసు గాయపడిందని తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. ఆ వెంటనే ఇక పార్టీ నుండి తనకు మద్దతు ఉండదనే భావనతో ఆయన వెంటనే పార్టీ మారాలని నిర్ణయించారని చెబుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ ను కలిసి వ్యక్తిగతంగా ఏ అంశం చర్చించారనేది మాత్రం తెలియటం లేదు. కేసుల మీదనే చర్చించారని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై వైసీపీ క్యాంపులో జోరుగా చర్చించుకంటున్నారు.