మాట్లాడితే కాదు.. బుద్ధి బలం ఉంటేనే నాయకుడు ..అది లోకేష్ కు బోలెడు ఉందన్న దివ్యవాణి
Recommended Video
తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ , ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నాయకురాలు దివ్య వాణి వైసీపీ నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు లోకేష్ మీద జరుగుతున్న మాటల దాడిపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. వైసీపీ నేతలపై విరుచుకుపడిన టీడీపీ అధికార ప్రతినిధి దివ్య వాణి లోకేష్ కు బుద్ధి బలం చాలా ఉందని , పాలించటానికి కావాల్సింది అదే అని కితాబిచ్చారు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై ఫైర్ అయిన దివ్యవాణి .. జగన్ స్పందించలేదని మండిపాటు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశంపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి. వైసీపీ అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటి వరకు ఆరుగురిని పొట్టన బెట్టుకున్నారని ఆమె ఫైర్ అయ్యారు . రాష్ట్రంలో ఇంతలా దాడులు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమని ఆమె అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలన అంటేనే అరాచక పాలన అనే భావన కలుగుతుందని ఆమె విమర్శించారు .
కూల్చే వాడు నాయకుడు కాదన్న దివ్యవాణి , కట్టేవాడే నాయకుడని కితాబు
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ , చక్కని పరిపాలన అందిచాలి కానీ ఇలా దాడులకు పురిగొల్పుతోందని విమర్శించారు. ఇక టీడీపీ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలను కూల్చివేయడం అభివృద్ధి కాదన్నారు. కూల్చేవాడు నాయకుడు కాదని నిర్మించే వాడే నాయకుడని ఆమె పేర్కొన్నారు .ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడంతోపాటు రాజధానిని నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడిదని ఆమె అభిప్రాయపడ్డారు . చంద్రబాబు నాయుడుకు ఉన్న ఫాలోయింగ్ దేశంలో ఇంకా ఎవరికైనా ఉందా అనిఆమె ప్రశ్నించారు . రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని అంతా ఆవేదనతో ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రధాని నరేంద్రమోదీకి పోటీ వచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కరే అని చెప్పుకొచ్చారు. జ్ఞానంలో, రాజకీయ అనుభవంలో మోదీని మించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అందువల్లే అంతా కలిసి ఏపీలో తెలుగుదేశం పార్టీని ఓడించారని దివ్య వాణి ఆరోపించారు.
లోకేష్ కు బుద్ధిబలం వుంది.. పరిపాలనకు కావాల్సింది అదే అన్న దివ్య వాణి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించడంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. మాట్లాడటం రాదనీ, ఈ నాలుగు పదాలు పలుకు అనీ వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు . ట్విట్టర్ లో పోస్టులు చేయాలంటే రెండు ఏళ్లు జైల్లో ఉండాలా అంటూ నిలదీశారు. ఇక ఈ వ్యాఖ్య విజయసాయిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. లోకేష్ ను ట్విట్టర్ పిట్ట అంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యవాణి. మాట్లాడే వాడే నాయకుడు కాదని బుద్ధిబలం ఉన్నవాడే నాయకుడని ఆమె కౌంటర్ ఇచ్చారు. పరిపాలించడానికి కావాల్సింది బుద్ధిబలమేనని ఆ బుద్ధిబలం నారా లోకేష్ దగ్గర చాలా ఉందన్నారు దివ్యవాణి.