లోకేష్ దూకుడు పెంచాడుగా .. వైసీపీ పాలనలో నీటి పారుదల లేదు కానీ నోటి పారుదల ఉధృతంగా ఉందని సెటైర్లు
Recommended Video
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో మాజీ మంత్రి నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. ఏపీ ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ బాగానే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ లో ఎవరో రాస్తే పోస్ట్ చెయ్యటం కాదన్న వైసీపీ నేతలకు బాగానే సమాధానం చెప్తున్నారు. అటు మండలిలో కూడా దుమ్ము దులుపుతున్నారు . వైసీపీ పాలన వచ్చాక రాష్ట్రంలో నీటిపారుదల లేకపోయినా సభల్లో మాత్రం వైసీపీ నేతల నోటిపారుదల ఉద్ధృతంగా ఉందని ఆయన సెటైర్లు వేశారు .
ఆరోపణలకు సాక్ష్యాలు ఉండాలన్న లోకేష్ .. ఆ డబ్బులేమన్నా మా అక్కా చెల్లెళ్లు, పెద్దమ్మ, చిన్నమ్మ కంపెనీలకో ఇచ్చానా అని ఫైర్
నోరుంది కదా అని ఆరోపణలు చేయగానే సరిపోదు, రుజువులు కూడా చూపించాలి కదా అని మండిపడ్డారు . పనిచేసేందుకైనా, చర్చించేందుకైనా సబ్జెక్టుపై అవగాహన ఉండాలన్న లోకేష్ అది లేనోళ్ళు ఇలాగే పలాయనం సాగిస్తారు అని అనిల్ కుమార్ పై విమర్శలు గుప్పించారు . అంతే కాదు టీడీపీ నేతలపై ఏపీ మంత్రులు చేసిన ఆరోపణలపైనా నారా లోకేశ్ మండిపడ్డారు. శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, ఒక మాజీ మంత్రిపై ప్రస్తుత మంత్రి ఆరోపణలు చేస్తే వాటిపై సాక్ష్యాధారాలు ఉండాలిగా అని ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో డబ్బులు మళ్లించానని ఆరోపణలు చేస్తున్నారని, ఆ డబ్బులేమన్నా మా అక్కా చెల్లెళ్లు, పెద్దమ్మ, చిన్నమ్మ కంపెనీలకో మళ్లించానా? చూపించండి అంటూ మండిపడ్డారు.
మందలగిరి అని హేళన చేస్తున్న వారికి రివర్స్ కౌంటర్ ఇచ్చిన నారా లోకేష్
ఇక తనకు మాట్లాడటం రాదనీ, మందలగిరి అని హేళన చేస్తున్న నాయకులకు కూడా అయన సమాధానం చెప్పారు. తాను పైచదువులు అమెరికాలో చదివానని, 2000 నుంచి 2008 వరకు అమెరికాలోనే ఉన్నానని, తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక పదం అటూఇటూ అవ్వొచ్చు. అయితే కానీ వీళ్ల లాగా దేశాన్ని దోచుకోలేదంటూ వైసీపీ సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని, నిప్పులా బతికామని, వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని అన్నారు. అవినీతి ఆరోపణలు చేసి తప్పించుకుంటే కుదరదని, నిరూపించాలని లోకేష్ బాబు గట్టిగానే డిమాండ్ చేశారు.వైసీపీ సభ్యులలా బూతులు మాట్లాడటం తమకు రాదని, వాస్తవాలు చెబుతుంటే నానా యాగీ చేస్తున్నారంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.
చినబాబు మాటల దాడికి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం
ట్విట్టర్ లోనే కాదు , సభలో కూడా లోకేష్ గట్టిగానే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కంటే ఇప్పుడు అధికారం లేని సమయంలోనే లోకేష్ అధికార పార్టీకి దీటుగా సమాధానం ఇస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తూ దాడికి దిగుతున్న తరుణంలో లోకేష్ బాబు కూడా చాలా సూటిగానే కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు . ఇక ఇది చూస్తున్న తెలుగు తమ్ముళ్ళు లోకేష్ లో వస్తున్న మార్పుపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.