లోకేష్ ది రాజకీయాల్లో కొత్త పంథా...విజయావకాశాలు పెరుగుతాయి:ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు:మంత్రి నారా లోకేష్ను హిప్నటైజ్ చేశారంటూ ఎంపి టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి ప్రతిస్పందించారు.
బుధవారం ఈ విషయంమై ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం చంద్రబాబు చెప్పిందే లోకేష్ ప్రకటించారని అన్నారు. రాజకీయాల్లో లోకేష్ ఓ కొత్త పంథాను అనుసరిస్తున్నారని, టీడీపీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఆయన కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని ఎస్వీ మోహన్రెడ్డి వివరణ ఇచ్చారు.
అభ్యర్థుల ఖరారుపై మంత్రి నారా లోకేష్ ప్రకటనను ఎస్వీ మోహన్ రెడ్డి సమర్థించారు. ఎమ్మిగనూరులో కూడా ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డేనని లోకేష్ ప్రకటించారని ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. అభ్యర్థుల పేర్లు ముందుగా ప్రకటించడం వల్ల విజయావకాశాలు మరింత పెరుగుతాయని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
గతంలో టీజీ వెంకటేష్కు ఎంపీ పదవి, తనకు ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అలాంటప్పుడు ఈ విషయంలో తాను ఎవరిని హిప్నటైజ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ గెలుపు కోసం అందరితో కలిసి పనిచేస్తానని, టీజీ వెంకటేష్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు.
కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసే కర్నూలు ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ స్థానాల నుంచి టికెట్లు ఆశించిన టీజీ వెంకటేశ్, లోకేష్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటుందని...మంత్రి నిర్ణయం కూడా ఇలాంటిదేనని ఎద్దేవా చేశారు. ఎస్వీ మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరని... అదే విధంగా లోకేష్ను ఎమైనా హిప్నటైజ్ చేశారేమో అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.