నడి రోడ్డు పై నరికేస్తా: వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపు: బయట పెట్టిన లోకేశ్..కట్ అండ్ పేస్ట్ అంటూ
టీడీపీ నేతల లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యే పైన ఒక ఆడియో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఆ ఆడియోలో వైసీపీ ఎమ్మెల్యే ఒక వ్యక్తిని దూషిస్తున్న మాటలు వినిపిస్తాయి. అసభ్య పద జాలం వాడారు. దీని పైన లోకేశ్ పోస్టు చేస్తూ ఇదేనా రాజన్న రాజ్యం అంటూ ప్రశ్నించారు. అయితే, దీనికి ఆ వైసీపీ ఎమ్మెల్యే సైతం ఘాటుగా స్పందించారు. తాను అనని మాటలను కట్ అండ్ పేస్ట్ చేసారని..తాను అనని మాటలను సైతం అందులో చేర్చారని పేర్కొన్నారు. అసలు ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు..ఏం జరిగిదంటే..
పోస్టింగ్లపై ఎమ్మెల్యే సీరియస్..
వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ జర్నలిస్టును ఫోన్లో బెదిరించారని టీడీపీ నేత లోకేశ్ ఒక ఆడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. అదే సమయంలో ఆ ఆడియోతో పాటుగా కామంట్ రాసారు. ‘ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించండి' అంటూ ట్విట్టర్లో లోకేష్ వ్యాఖ్యానించారు. ఆ ఆడియోలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఒక వ్యక్తి మీద సీరియస్ అవుతూ నా మీదే పోస్టింగ్లు పెడతావా అని తీవ్ర పదజాలంలో దూషిస్తున్న మాటలు వినిపిస్తాయి. నీ తోలు తీస్తా.. నీవేమైనా పెద్ద తోపువా..అంతా రికార్డు చేఉకో..నడి రోడ్డుపై నరికేస్తా..నీ ఇంటికే వస్తా అంటూ ఆయన ఫైర్ అయిన మాటలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. వైసీపీ లక్ష్యంగా కొద్ది రోజులుగా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారానే స్పందిస్తున్నారు. తాజా అంశంలో సైతం అదే విధంగా స్పందించారు.
కోటంరెడ్డి ఘాటు సమాధానం..
లోకేశ్ ట్విట్టర్లో తన మీద ఆడియో పోస్ట్ చేసిన విషయాన్ని కోటంరెడ్డి సీరియస్గా తీసుకున్నారు. లోకేశ్ తండ్రి చంద్రబాబు గతంలో ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరద్ రాంను హత్య చేయించిన విషయం తెలుసా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి తన పత్రికలో రాసిన కారణంగా చంద్రబాబు హత్య చేయించార ని పేర్కొన్నారు. లోకేశ్ ఈ విషయాన్ని తన తండ్రిని అడిగి తెలుసుకోవాలని..తనకూ కుటుంబ సభ్యులు ఉంటారని వారి గురించి జర్నలిస్టు ముసుగులో ఇష్టానుసారం కధనాలు..వ్యాఖ్యానాలు రాస్తే చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేసారు. అసలు తాను మాట్లాడిన వ్యక్తి జర్నిలిస్టు కాదని..ఆ ముసుగులో రాజకీయ నేతల వద్ద దళారీ అని వివరించారు. వ్యాపారాలు చేయకుండా.. పెట్టుబడులు లేకుండా కోట్లాది రూపాయాలు సంపాదిస్తున్న ముఠా నాయకుడని చెప్పుకొచ్చారు. నెల్లూరుకు చెందిన ఒక ప్రముఖ పత్రిక పేరు చెప్పకొని వారు దందా కొనసాగిస్తున్నారని కోటంరెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
కట్ అండ్ పేస్ట్ ఆడియో అది..
లోకేశ్ మంగళగిరిలో ఓడిన తరువాత ట్విట్టర్ బాబుగా మారారాని కోటంరెడ్డి ఎద్దేవా చేసారు. ఎన్నికల సమయంలో తన పైన ఇష్టానుసారం పోస్టింగ్లు పెడితే తాను మందలించానని.. ఆ మాటలకు కట్ పేస్ట్లు చేసి తన ఆడియోగా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారని చెప్పుకొచ్చారు. అది ఎన్నికల సమయంలో జరిగిన ఘటన అని వివరించారు. ఇక, తాను అనని మాటలను సైతం అందులో చొప్పించారని ఆరోపించారు. తన గురించి..తన కుటుంబ సభ్యుల గురించి ఇష్టానుసారం పోస్టింగ్లు పెడితే చూస్తూ కూర్చోలేమని స్పష్టం చేసారు. లోకేశ్ ఇప్పటికైనా తన తండ్రి వద్దకు వెళ్లి పింగళి దశరధ్రాం ను ఎవరు హత్య చేసారు..ఆయన ఏం చేసాడో తెలుసుకోవాలని సూచించారు. అయితే లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆడియో పోస్ట్ చేయటంతో..దీనికి సమాధానంగా కోటంరెడ్డి తన వివరణ..విషయం పైన స్పష్టత ఇస్తూ వీడియో రిలీజ్ చేసారు.