'అది తప్పయితే.. 32 ఎకరాల్లో జగన్ తన ఇంటిని ఎలా నిర్మించుకున్నారు?'
అనంతపురం : ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్న జగన్.. తన ఇంటిని మాత్రం 32ఎకరాల్లో ఎలా నిర్మించుకోగలిగారని ప్రశ్నించారు.
బుధవారం అనంతపురంలోని పీపీకేకే ఇంజనీరింగ్ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి సందర్బంగా.. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న క్రమంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం కోసం వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా ఓ విద్యార్థిని.. 'రాష్ట్ర విభజన తర్వాత బాబు వస్తేనే జాబు వస్తుందన్నారని, ఇప్పుడాయన సీఎంగా ఉన్నారు కాబట్టి.. ఉపాధి అవకాశాలకోసం ఏ నిర్ణయం తీసుకున్నారని' ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కలిపి రాష్ట్రంలో మూడున్నర లక్షల మందికి ఉద్యోగులకు కల్పించామని తెలిపారు లోకేష్.