"విదేశీ అమ్మాయిలతో సెల్ఫీలు: ఐదారు వందలు దిగా.. సాక్షిలో వచ్చింది మూడే"
అనంతపురం : సాక్షి దినపత్రికకు టీడీపీకి ఎంతటి వైరం ఉందో అందరికీ తెలిసిందే. టీడీపీ-వైసీపీ మధ్య రాజకీయాలు పత్రికా ముఖంగా తలబడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఎవరి అనుకూల మీడియాతో వారు ప్రత్యర్థులను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే పలు ఆరోపణలు.. విమర్శలు.. పత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కి దర్శనమిస్తుంటాయి.
అలా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన విదేశీ స్నేహితులైన అమ్మాయిలతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు సాక్షి దినపత్రిక ద్వారా గతంలో బహిర్గతమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అంశంపై మరోసారి స్పందించారు లోకేష్. అనంతరపురం శివారులోని పీవీకేకే ఇంజనీరింగ్ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా.. ఓ విద్యార్థి ఇదే ప్రశ్నను లేవనెత్తుతూ లోకేష్ ను ప్రశ్నించాడు,
'మీరు విదేశీ అమ్మాయిలతో తిరిగారనే ప్రచారం జరుగుతోంది.. ఇది ఎంతవరకు నిజం?' అని సునీల్ అనే ఓ విద్యార్థి లోకేష్ ను ప్రశ్నించాడు. దీనిపై స్పందిస్తూ.. సెల్ఫీలు దిగడం తప్పా అని బదులిచ్చారు. ఇక సన్నిహితంగా మెలగడం గురించి పరోక్షంగా స్పందిస్తూ.. సెల్ఫీలు దిగేటప్పుడు రకరకాల పోజులు ఇస్తుంటాం.. నేను అదే చేశా.. అని చెప్పారు.
స్టాన్ ఫర్డ్ నుంచి వచ్చిన స్నేహితులతో గడిపేందుకు.. 2006లో వారితో కలిసి దేశమంతా తిరిగానని లోకేష్ తెలిపారు. 'ఆ సందర్బంగా దాదాపు ఐదారు వందల ఫోటోలు దిగుంటానని, సాక్షిలో వచ్చినవి కేవలం మూడు ఫోటోలేనని' లోకేష్ పేర్కొన్నారు. సాక్షి పత్రిక అవాస్తవాలను ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు.
మీరెప్పుడు సీఎం అవుతారని మరో విద్యార్థి ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తగా.. మరో ఐదుసార్లు చంద్రబాబే రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని చెప్పుకొచ్చారు లోకేష్. బాబుకు అండగా ఉంటారో.. జగన్ వెనుక నిలబడుతారో.. ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.