ఆర్కే అనుచరులతో లోకేష్ కు ప్రాణహాని .. ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
ఏపీలో రాజకీయ ఘర్షణలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఒకరిమీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు మాత్రమే కాదు ఒకరిపై ఒకరు ఫిర్యాదులకు కూడా నేతలు వెనకాడటం లేదు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కి, నారా లోకేష్ కు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. నిన్నటికి నిన్న పార్టీ సోషల్ మీడియా విభాగం, టీమ్ లోకేష్ నుండి తనకు ప్రాణహాని ఉందని ,తనను ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా టీడీపీ నేతలు సైతం తమ నాయకుడు లోకేష్ కు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు.
నారా లోకేష్కు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేతల ఆందోళన .. తాడేపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్కు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల వల్ల మాజీ మంత్రి లోకేష్కు ప్రాణహానీ ఉందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన టిడిపి నాయకులు తమ నాయకుడు అయిన నారా లోకేష్ పై మంగళగిరి వైసిపి నేతలు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని, మాజీ సిఎం చంద్రబాబుపైనా , నారా లోకేష్పైనా పప్పు, దొంగ అని మాట్లాడుతున్నారని, అంతేకాకుండా బెదిరింపులకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కె అనుచరులు, వైసిపి నాయకుల వల్ల నారా లోకేష్కు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో టిడిపి నేతలు పేర్కొన్నారు.
తనకు లోకేష్ టీమ్ తో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన ఆర్కే .. రివర్స్ ఫిర్యాదు చేసిన టీడీపీ
నిన్నటికి నిన్న మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించారు అన్న అక్కసుతో టీం లోకేష్ సభ్యుడు నాని చౌదరి తనను బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలో ఎలా బతుకుతారో చూస్తామని తనను హెచ్చరిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు వైయస్ జగన్ ను జైలుకు పంపిస్తామని, తనను మంగళగిరి నుండి తరిమి కొడదామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి నారా లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి ప్రజలు తరిమి కొట్టిన లోకేష్ కు బుద్ధి రాలేదని, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనను బెదిరింపులకు గురి చేసినా భయపడేది లేదని ఆయన తేల్చి చెప్పారు.ఇక దీంతో టీడీపీ కూడా ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది.
విమర్శలతో ఆగకుండా ప్రాణహాని ఫిర్యాదులకు చేరిన ఏపీ రాజకీయం
ఇక లోకేష్ టీమ్ సభ్యుల పైన ఫిర్యాదు చేసిన ఆర్కే చర్యతో ప్రతి చర్యగా టిడిపి నాయకులు ఆర్కే అనుచరులతో నారా లోకేష్ కు ప్రాణహాని ఉందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో మంగళగిరి రాజకీయం ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ ఏపీలో రాజకీయాలు, విమర్శలు ప్రతి విమర్శలతోనే ఆగకుండా ఘర్షణలు, దాడులు, కేసులతో కొనసాగుతుండడం నిజంగా ఆందోళన కలిగిస్తున్న అంశం.